Ashish Vidyarthi: ప్రముఖ నటుడు అశిష్ విద్యార్థి సతీమణి రూపాలి బరూవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ అంశంపై అశిష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. తన భార్య రోడ్డు ప్రమాదానికి గురైనప్పటికీ క్షేమంగానే ఉన్నారని ఆయన తెలిపారు. అశిష్.. వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం.. గువహటిలో అశిష్, అతడి భార్య రూపాలి బరూవా శుక్రవారం రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక బైక్ ఇద్దరినీ ఢీకొంది. ఈ ఘటనలో రూపాలికి గాయాలయ్యాయి.
వెంటనే రూపాలిని ఆస్పత్రికి తరలించగా, ఆమెను వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారని, ప్రస్తుతం ఆమెతోపాటు తాను కూడా క్షేమంగా ఉన్నానని అశిష్ తెలిపారు. ఈ ఘటనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించి, తాను స్పష్టతనిస్తున్నట్లు అశిష్ తెలిపారు. తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనలో బైకర్ కూడా క్షేమంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తమపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక.. అశిష్, రూపాలి 2023లో పెళ్లి చేసుకున్నారు. అశిష్ కు ఇది రెండో వివాహం. గతంలో అశిష్.. పిలూ విద్యార్థి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. 22 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2022లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అశిష్.. తెలుగులో గుడుంబా శంకర్, పోకిరి, చిరుత వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.