Adivi Sesh | ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతి సినీ ప్రేమికుడు తలుస్తున్న పేరు ‘మేజర్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా రాణిస్తుంది. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం అతిశయోక్తి కాదు. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడు. అడివి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా మేజర్ చిత్రం నిలిచింది. తాజాగా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేకర్స్ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో అడివిశేష్ మాట్లాడుతూ ‘ఆర్మీలో చేరాలనుకునే యువతకు మద్ధతిస్తాం. ఎలా మద్ధతిస్తాం అనేది త్వరలో చెబుతా. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మొదట 10 మంది యువతతో స్టార్ట్ చేస్తాం. అది ఎంత మందికి చేరుతుందనేది తెలియదు’ అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దీనిపై పలువురు నెటిజన్లు గొప్ప పని చేస్తున్నావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మేజర్ చిత్రంలో అడివి శేష్కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.