Acharya Movie | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి, రామ్చరణ్ నటించిన ఆచార్య సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ట్వీట్ చేసింది. దీంతో మెగా అభిమానుల్లో జోష్ వచ్చింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆచార్య విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిన్న కొణిదెల ప్రొడక్షన్స్ ప్రకటించడంతో.. చిరు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచార్య సినిమా విడుదలకు సంబంధించి 24 గంటల వ్యవధిలోనే కొణిదెల ప్రొడక్షన్స్ మరో ట్వీట్ చేసి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
ఆచార్య సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటిస్తూ శనివారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీన ఈ మూవీ విడుదల కావాల్సి ఉండే. కరోనా ఉధృతి దృష్ట్యా సినిమా విడుదలను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కొణిదెల ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడ్డాయి.