దేనికోసం ఎక్కువగా ఎదురు చూస్తే.. అది ఇంకాస్త ఎక్కువ రోజులు మనకు దక్కకుండా పోతుందంటారు. ఇంకా ఎక్కువ ఎదురు చూసేలా చేస్తుందంటారు. ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ సినిమా కూడా ఇంకా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. మూడేళ్లుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. అయినప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. జరుగుతుంది.. జరుగుతూనే ఉంది. ఈ పాటికే సినిమా కూడా విడుదల కావాల్సి ఉన్నా కూడా మధ్యలో ఎన్నో కారణాలు ఈ సినిమాకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. అందులో మేజర్ బ్రేకులు కరోనా కారణంగానే వచ్చాయి.
నిజానికి 2020లోనే ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసాడు దర్శకుడు కొరటాల శివ. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో దాదాపు ఏడు నెలలు అక్కడే పోయింది.
మొన్నీమధ్యే మళ్లీ పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అని షూటింగ్ ప్రారంభిస్తే మూడు నెలలు కూడా కాకుండానే మరోసారి కోవిడ్ దాడి మొదలైంది.
ఇప్పటి వరకు 80 శాతం పైగానే షూటింగ్ పూర్తి చేసాడు కొరటాల. ఇంకా కొన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మొన్నామధ్య ఫైనల్ షెడ్యూల్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసారు. ట్విట్టర్ లో చరణ్ నడిచొస్తున్న ఫొటోను రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు.
ఆ షెడ్యూల్ మొదలైన తర్వాత.. ఆచార్యను పక్కనబెట్టి లూసీఫర్ రీమేక్ కూడా మొదలు పెట్టాడు మెగాస్టార్. అక్టోబర్ లో ఆచార్య వస్తుందని ప్రచారం జరుగుతున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది రానట్లే. ఎందుకంటే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా ఇంకా షూట్ చేయాల్సి ఉంది.
ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆయనపై కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాలో చిరంజీవితో కాజల్.. రామ్ చరణ్ తో పూజా హెగ్డే జోడీ కట్టారు.