ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్నారు. మిషా నారంగ్ నాయికగా నటిస్తున్నది. చాగంటి ప్రొడక్షన్ పతాకంపై ఆజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ వీడియో చూస్తే…ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కథానాయకుడు నేరం జరిగిన చోటు నుంచి ప్రతి చిన్న ఆధారాన్ని సేకరిస్తున్నాడు. ఈ ఆధారాలతో ఫోరెన్సిక్ నివేదిక తయారు చేసి నేరస్థులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఆది సాయికుమార్ అభినయం ఆకట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.