Aadhi Pinisetty | నందమూరి బాలకృష్ణను చూసినవాళ్లెవరైనా ఆయన ఎనర్జీకి ఫిదా అయిపోవాల్సిందే. తాజాగా టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్యతో కలిసి నటించడం ఓ ప్రత్యేక అనుభవంగా మిగిలిందని చెబుతూ, “బాలకృష్ణ గారు ఒక వ్యక్తి కాదు… ఓ శక్తి. ఆయన ఒరిజినల్ గా స్క్రీన్ మీద కనిపించేలా నిజ జీవితంలోనూ పవర్ హౌస్ లాంటి వ్యక్తిత్వం కలవారు” అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీగా వస్తున్న అఖండ 2 కోసం బాలయ్య-బోయపాటి శ్రీను మళ్లీ కలిశారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన, ‘‘బాలయ్య గారి పనితీరు, కష్టపడే తత్వం చాలా మందికి స్పూర్తిదాయకం. స్క్రీన్ పైనా, ఆఫ్ స్క్రీన్ పైనా ఆయన ఎనర్జీ అసాధారణం’’ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వ శైలిపై ఆది ప్రశంసలు కురిపిస్తూ, ‘‘ఆయన డైరెక్షన్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటేనే ఆడియన్స్లో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి సినిమా లో నాకూ ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. గతంలోనూ బోయపాటి దర్శకత్వంలో పనిచేసిన అనుభవం ఉందని, ఈ సారి మరింత బలమైన పాత్ర దక్కిందని వెల్లడించారు ఆది.
తనకు విలన్ పాత్రల్లో నటించడంపై ఉన్న ఆసక్తిని వెల్లడించిన ఆది, ‘‘విలన్ క్యారెక్టర్లకు ఎలాంటి పరిమితులు ఉండవు. అవి నటనకు విశేషమైన అవకాశాలు కలిగిస్తాయి. మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు, మిడిల్లో ఉండే పాత్రలే ఎక్కువ బలాన్నిస్తాయి. అందుకే విలన్ పాత్రలు నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటాయి అని అన్నారు. ఇక అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మొదట భావించగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.