Nani | ఈ మధ్య కాలంలో టీజర్, ట్రైలర్తో జనాల్లో ఒక్క సారిగా హైప్ తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది 800 సినిమానే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా రికార్డులకెక్కిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్గా తెరకెక్కిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాములుగానే బయోపిక్ అని కనిపిస్తే చాలు జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా భారతీయులు ఎంతో ఇష్టపడే క్రికెట్ నేపథ్యంలో సినిమా వస్తుందంటే వాళ్లలో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా సచిన్ టెండుల్కర్, ముత్తయ్య మురళిధరణ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూళి వంటి దిగ్గజాలు సినిమాను ప్రమోట్ చేయడంతో జనాల్లో తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ను నిర్మాత శివలెంక ప్రసాద్ వెల్లడించాడు. ఈ సినిమా కథను ముందుగా నానితో చేయాలని అనుకున్నానని, అతనికి కథ కూడా నెరేట్ చేశానని చెప్పాడు. ఆయనకు కూడా స్టోరీ బాగా నచ్చింది. అయితే అప్పటికి జెర్సీ రిలీజై ఏడాదిన్నర మాత్రమే అయింది. దాంతో నాని అప్పుడే క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో మరో సినిమా అంటే రెడీగా లేనని చెప్పాడని శివలెంక ప్రసాద్ వెల్లడించాడు. నిజానికి ముందుగా ఈ సినిమాను విజయ్ సేతుపతితో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఫస్ట్లుక్ కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఆయన ప్లేస్లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టర్ వచ్చాడు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముత్తయ్య మురళిధరన్ తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబం. కడు పేదరికంలో ఎన్నో అవమానాల మధ్య చాలీ చాలని తిండితో రోజులు గడుపుతూ ఉంటారు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న మురళీధరన్ ఈ అవరోధాలు తట్టుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంటాడు. బాక్సింగ్ డే మ్యాచ్ లో బంతిని విసురుతున్నాడనే అభియోగం మీద క్రీడకు దూరం చేయడంతో అంతుచిక్కని వలయంలో చిక్కుకుంటాడు. పడిన చోటే లేవాలనే సూత్రం అనుసరించి తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపిస్తాడు.