విడుదలకు ముందే ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సెంట్రిక్ మూవీలో అనంతిక సనీల్కుమార్ లీడ్రోల్ పోషించారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేశారు. ‘ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. అంత్యక్రియలకి, కర్మ కాండలకు వాళ్లు పనికిరారు..’ అంటూ ఓ పాత్ర చెప్పిన మాటలకు ‘పేగు పంచి ప్రాణం పొయ్యగలిగిన వాళ్లం..
చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా..’ అంటూ అనంతిక బదులు చెప్పిన సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. సమాజంలోని మూఢనమ్మకాలను ప్రశ్నించే ఓ మహిళ కథ ఇదని ట్రైలర్ చూస్తే తెలుస్తున్నది. కూతురుగా మొదలై, కాలగమనంలో సమాజంలోని విపరీత పోకడలను ఎదిరించి నిలిచిన ధైర్యవంతురాలి కథ ఇదని ట్రైలర్ చెబుతున్నది. అనంతిక పాత్ర భావోద్వేగాల సమ్మేళనంగా ఉంటుందని, యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్రెడ్డి, సంగీతం: హెషామ్ అబ్దుల్.