జిల్లా కేంద్రానికి సమానంగా ‘కంది’ అభివృద్ధి
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ
పచ్చదనం, పరిశుభ్రతలో భేష్
పల్లె ప్రగతిలో మారిన గ్రామ స్వరూపం
ఒకప్పుడు అభివృద్ధిని ఎరుగని ఆ గ్రామం ఇప్పుడు జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమానంగా ప్రగతిని సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ మండలాల ఏర్పాటులో భాగంగా కంది గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ మండలం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుండడంతో ఇక్కడి గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. – కంది, మే 9
కంది గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ తాగునీరు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలు పూర్తయినాయి. రైతు వేదిక భవనాన్ని కూడా నిర్మించి ప్రారంభించారు. ఇదిలాఉండగా, కంది మండలం ఏర్పడిన తర్వాత సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రధాన జిల్లా కార్యాలయాలు ఇక్కడికే మార్చారు. ఇందులో జిల్లా రిజిస్ట్రేషన్, జిల్లా జైలు, జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, అక్షయపాత్రతో పాటు జిల్లా పశువైద్య కార్యాలయాలు ఇక్కడే నూతనంగా ఏర్పడ్డాయి. మరో విశేషం ఏమిటంటే ఇదే మండల పరిధిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్తో పాటు జిల్లా వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలు కూడా ఉండడంతో కంది గ్రామ పంచాయతీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్గా మారింది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ధీటుగా ఇప్పుడు కంది గ్రామం అభివృద్ధి చెందుతుందంటే తెలంగాణ సర్కార్ వల్లే అది సాధ్యపడుతుందని ఇక్కడి గ్రామ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనులు…
కంది గ్రామ సర్పంచ్ విమల విరేశం బాధ్యతలు చేపట్టిన తర్వాత కందిలో రూ.70 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.8 లక్షలతో వాటర్పైపులైన్ పనులు, రైతువేదిక భవనం, డంప్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, నర్సరీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే, రూ.30 లక్షలతో లక్ష్మీనగర్కాలనీలో అండర్గ్రౌండ్ పనులుతో పాటు సీసీ రోడ్ల పనులను కూడా ప్రారంభించారు.
కంది గ్రామ వివరాలు…
కంది గ్రామం విస్తీర్ణం మొత్తం 4498 ఎకరాల్లో ఉన్నది. ఇందులో 2825 వ్యవసాయ భూమి ఉండగా, 4 ఎకరాల్లో గృహోపకాలున్నాయి. మొ త్తం జనాభా 5458 ఉండగా, పురుషు లు 2655, మహిళలు 2803 ఉన్నారు.
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా కందిని మండల కేంద్రంగా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జోరుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్తగా రైతు వేదిక భవనం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంతో పాటు అవసరమై అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టాం. మిషన్భగీరథ ద్వారా 90 శాతం గ్రామ ప్రజలకు ఇంటింటికీ తాగునీటి అందజేస్తున్నాము.
విమల వీరేశం, కంది సర్పంచ్
అందరి సహకారంతో అభివృద్ధి..
కంది గ్రామం అభివృద్ధిలో ముందుకుపోవడంతో అటు ప్రభుత్వంతో పాటు ఇటు స్థానిక ప్రజల సహకారం కూడా ఎంతో ఉంది. ప్రజలు ఏదైనా సమస్యలతో వస్తే వాటిని వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తున్నాం. స్థానిక పాలకవర్గ సభ్యుల సహకారం కూడా ఎంతో బాగుంది.
ఎం.ఎస్.ఎస్.వాణీ,
పంచాయతీ కార్యదర్శి, కంది