దక్షిణాది సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందులో తెలుగు సినిమా ఉండటం సంతోషంగా ఉందని అన్నారు స్టార్ హీరో అల్లు అర్జున్. ఆయన అతిథిగా ’18 పేజెస్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రాన్ని సుకుమార్ అందించిన కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ…’దక్షిణాది నుంచి బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి చిత్రాలు ఉత్తరాదికి వెళ్లి మంచి ఆదరణ పొందాయి. ఇటీవల కాంతార కూడా ఘన విజయాన్ని సాధించింది. మన సినిమాలను దేశం చూస్తుండటం ఆనందంగా ఉంది. ’18 పేజెస్’ సినిమా నాకెంతో ప్రత్యేకం ఎందుకంటే నేను ఇష్టపడే దర్శకుడు సుకుమార్, నాకు నచ్చిన నటుడు నిఖిల్, మా సొంత సంస్థ గీతా ఆరట్స్ కలిపి చేశాయి. ఈ సినిమా విజయం సాధించాలి. ’పుష్ప 2’ ఏ అంశంలోనూ తగ్గదు’ అన్నారు. సుకుమార్ రాసిన సిద్ధు పాత్రలో నటించడం గర్వంగా భావించానని, అల్లు అరవింద్ ఒక పెద్దలా మమ్మల్ని చూసుకున్నారని హీరో నిఖిల్ చెప్పారు.
’ఆర్య’ సినిమా నుంచి తాను అల్లు అర్జున్ అభిమాని అయ్యానని, ఈ చిత్రంలో నందినీ పాత్రలో మిమ్మల్ని అలరిస్తానని నాయిక అనుపమా పరమేశ్వరన్ తెలిపింది. పుష్ప సినిమా కథ కూడా వినకుండా అల్లు అర్జున్ ఓకే చేశారని, తనపై అంత నమ్మకం ఉంచారన్న సుకుమార్…హ్యాపీడేస్ సినిమా చూసినప్పుడే నిఖిల్ పెద్ద హీరో అవుతాడని నమ్మానని, అప్పుడే లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని చెప్పారు. ఓ మంచి కథను మా సంస్థకు సుకుమార్ ఇచ్చారని, సినిమా బాగా వచ్చిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ…’ఓ మంచి చిత్రాన్ని రూపొందించాం. చూసిన అందరికీ నచ్చింది. రేపు మీరూ ఇష్టపడతారని ఆశిస్తున్నా’ అన్నారు.