సాధారణ ఎలక్షన్స్ కన్నా రంజుగా మా ఎలక్షన్స్ మారనున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు మా సభ్యులు, అధ్యక్ష పదవికి పోటీ చేసే వాళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా, నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న నరేష్ని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. నరేష్ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారని నటి హేమ ఆరోపించారు. దీనికి సంబంధించి హేమ మాట్లాడిన ఆడియో రికార్డ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
హేమ వ్యాఖ్యలను తిప్పి కొడుతూ నరేష్, జీవిత పలు కామెంట్స్ చేశారు. తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని నరేష్ అన్నారు. అయితే తర్వాతి రోజు నటి హేమకు క్రమశిక్షణ సంఘం తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణంరాజుకి లేఖ రాసారు. సభ్యుల ప్రవర్తన వలన అసోసియేషన్ ప్రతిష్ట మసకబారుతోందని.. ఈ విషయంలో అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేవారి విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలానే మా ఎన్నికలు వెంటనే జరపాలని, లేట్ అవుతున్న కొద్ది సంక్షేమ కార్యక్రమాలు కూడా నిలిచిపోతున్నాయంటూ తన లేఖలో పేర్కొన్నారు చిరు.అయితే చిరంజీవి లేఖ రాసిన 24గంటల్లోనే ఆయన బాటలో 113 మంది మా సభ్యులు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన్ను కోరారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కృష్ణం రాజు ఎలా స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.