నల్లగొండ, ఆగస్టు 25 : తెలుగు సినీ చరిత్రలో జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఎన్నడూ రాని విధంగా ఈ సారి టాలీవుడ్కు పది అవార్డులు రావడంతో తెలుగోడి కీర్తి యావత్ భారతానికి తెలిసింది. ఆ పది అవార్డుల్లో ఒకటి నల్లగొండ జిల్లాకు చెందిన సాహితీవేత్తకు వచ్చింది. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులు 69వ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు. నిన్నటి వరకు సాధారణ కవిగా ఉన్న పురుషోత్తమాచార్యులు నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది నల్లగొండ కవిగా పేరు సంపాదించారు. వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఆయన ఇటీవల మిసిమి మాస పత్రికలో సినిమా పాటలపై రాసిన విమర్శనాత్మక వ్యాసాలకు ఈ అవార్డు దక్కింది.
సాధారణంగా సంగీతాలు నాలుగు రకాలుగా ఉంటాయి. వాటిలో శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతం ఉంటాయి. మన సినిమాల్లో ఎక్కువగా ఆది నుంచి శాస్త్రీయ సంగీత నేపథ్యంలో పాటలు ఉండగా వాటిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు మన ముడుంబై పురుషోత్తమాచార్యులు. శాస్త్రీయ సంగీతం అంటే సంగీత శాస్త్ర ప్రకారంగా ఆలపించడం అన్నమాట. సినిమాల్లో పాడే పాటలను ఆయన ఆయా పాటల్లో ఉన్న సాహిత్యపు విలువలు, ట్యూన్ చేసిన విధానం, గాయకులు పాడిన తీరును పరిశీలించి ఆ పాటలను ఏయే సందర్భంలో ఉపయోగించారనే కోణంలో పరిశీలించి విమర్శలు చేసేవారు. ఆ విమర్శలను మిసిమి అనే మాస పత్రికలో మూడేండ్లుగా ప్రచురిస్తున్నారు. విమర్శ అంటే క్లాసికల్ పాటలను సినిమాల్లో సినీ టిక్(ప్రేక్షకులకు నచ్చే విధంగా) పద్ధతిలో పాడుతూ ఉంటే వాటిలో మంచిని మంచి అని, చెడును చెడును చెడు అని విమర్శ చేసి వ్యాసం రూపంలో రాశారు. వీటిని పరిశీలించిన నేషనల్ జ్యూరీ బృందం క్రిటిక్ విభాగంలో అవార్డుకు ఎంపిక చేసింది.
మనకున్న సంగీత కళల్లో ఏదో ఒక సంగీత కళను అన్వయిస్తూ లిరిక్ రైటర్లు పాటలు రాయగా సింగర్లు పాడుతూ ఉండటం సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఈ పాటల్లో ఉన్న అర్థమేంటి? ఆ అర్థాన్ని బట్టే సంగీతాన్ని సమకూర్చడంతోపాటు పాటలు పాడారా అనే కోణంలో పరిశీలించి విమర్శ చేయడం. అసలు సినిమాల్లో ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారా లేదా అనే కోణంలో మంచిని మంచి, చెడును చెడు అంటూ విమర్శలు చేయవచ్చు కదా అని మిసిమి ఎడిటర్ అశ్వన్ కుమార్( ఘంటసాల గానసభ అధ్యక్షుడు-హైదరాబాద్) సలహా ఇచ్చారు. దాంతో శాస్త్రీయ సంగీతాన్ని అత్యంత ఇష్టపడే ఘంటసాల పాటల నుంచి ఈ విమర్శలు మొదలు పెట్టిన పురషోత్తం 1943 నుంచి సినిమాల్లో పాడిన పాటలకు ఈ విమర్శలు షురూ చేశారు. ఇప్పటి వరకు రెండు పుస్తకాలు కూడా రాయగా అవి ప్రస్తుతం ప్రింటింగ్ స్టేజీలో ఉన్నాయి.
హుజూర్నగర్కు చెందిన వెంకటనర్సింహాచార్యులు-మంగతాయారమ్మ కుమారుడైన ముడుంబై పురుషోత్తమాచార్యులు స్వయాన సంగీత విద్వాంసులైన తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. హైస్కూల్ విద్యాభ్యాసం అక్కడే చదివినప్పటికీ ఉన్నత విద్య వరంగల్లో పూర్తిచేశారు. నల్లగొండలోని రామగిరి గీతా విజ్ఞాన మందిర్లో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసి 2006లో రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత లలిత గీతాల్లో సరాగాలు, శాస్త్రీయ గీతాల్లో కృతి రాగాలు పేరుతో పుస్తకాలు రాసిన ఆయన మిసిమి ఎడిటర్ సూచనతో 2020 నుంచి సినిమా విమర్శ వ్యాసాలు రాస్తున్నారు. ఇవి చూసిన ఆయన స్నేహితుడు రమేశ్బాబు సలహాతో ఈ ఏడాది మేలో 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఎంట్రీకి పంపగా జ్యూరీ బృందం ఈ వ్యాసాలను పరిశీలించి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా ఎంపిక చేసి అవార్డు ఇచ్చింది. పురుషోత్తమాచార్యులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా ప్రస్తుతం వారు ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. పురుషోత్తమాచార్యులు ప్రస్తుతం నల్లగొండలో ఉంటూ సినీ క్రిటిక్ వ్యాసాలు రాస్తూ అన్నమయ్య సంకీర్తనాచార్య ప్రచార సమితి పేరుతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు.
నేను మిసిమి పుస్తకంలో 2020 నుంచి ప్రతి నెలకు ఒక వ్యాసం రాస్తూ వస్తున్నాను. 1943 నుంచి ఇప్పటి వరకు సినిమాల్లోని పాటల్లో మంచి, చెడులను వివరిస్తూ విమర్శలు చేస్తూ వ్యాసాలు రాస్తున్నా. నా వ్యాసాన్ని జ్యూరీ టీమ్ గుర్తించి జాతీయ ఆవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చినది కాదు. ఓ తెలుగు కవికి వచ్చిన గుర్తింపు. ఈ అవార్డుతో ఒక తెలుగు విమర్శకుడికి మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు వాగ్గేయకారుల రచనల ఆధారంగా( దేవదాసు, త్యాగరాజు, జయదేవుడి రచనలు)ఒక పుస్తకం రాశాను. జావలీలు, యక్షగానాలు, తిల్లనాలు, హరికథల ద్వారా శాస్త్రీయ ఆధారాలతో మరో పుస్తకం రాయగా అవి ముద్రణ దశలో ఉన్నాయి.
-ముడుంబై పురుషోత్తమాచార్యులు, సినీ కవి విమర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత, నల్లగొండ