తాను అభిమానించే హీరో చిరంజీవితో కలిసి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించడం మర్చిపోలేని అనుభవమని అన్నారు నటుడు సత్యదేవ్. ఆయన ఈ చిత్రంలో జైదేవ్ పాత్రలో కనిపించనున్నారు. నయనతార, సల్మాన్ఖాన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు తెలిపారు సత్యదేవ్.
చిరంజీవి కథ చెప్పారు
ఒక రోజు చిరంజీవి గారు ఫోన్ చేసి ఇంటికి భోజనానికి రమ్మన్నారు. ‘గాడ్ ఫాదర్’లో నటించమని, కథ చెప్పడం ప్రారంభించారు. నేను ఆయననే చూస్తూ ఉండిపోయాను. కథ ఎలా ఉందని అడిగితే..మీ సినిమాలో అవకాశం రావడమే అదృష్టం. ఫోన్ చేస్తే చాలు. మీరు కథ చెప్పడం, నటిస్తావా అని అడగడం కలా నిజమా అనిపిస్తుంది అన్నాను. నటిస్తున్నప్పుడు ఈ పాత్ర కథలో ఎంత ముఖ్యమైందో అర్థమైంది. ఇటీవల ఆయన ఇంటర్వ్యూల్లో నా నటన బాగుందని చెప్పడం సంతోషాన్నిచ్చింది. ఆయన సినిమాలు చూసి పెరిగిన నాకు, ఆయన దగ్గర నుంచి ప్రశంస రావడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించింది.
టార్గెట్ నేనే
దర్శకుడు మోహన్ రాజా తన చిత్రాల్లో విలన్ క్యారెక్టర్లను వైవిధ్యంగా మలుస్తారు. ఇందులో జైదేవ్ పాత్రలో కనిపిస్తాను. అతనికి అధికార వ్యామోహం ఎక్కువ. దురాశాపరుడు. ఇతర ప్రధాన పాత్రలన్నింటికీ నేనే టార్గెట్గా ఉంటాను. వారు నేను వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. చిరంజీవి గారితో నేను తలపడే సన్నివేశాలు బాగా వచ్చాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. ైక్లెమాక్స్లో 14 నిమిషాల ఫైట్ సీన్ అదిరిపోతుంది. ఇలాంటి ఆకర్షణలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి.
హీరోగా నటించడానికే ప్రాధాన్యత
ప్రత్యేక పాత్రల్లో అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమే అయితే నా తొలి ప్రాధాన్యత సోలో హీరోగా సినిమాలు చేయడం. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’, ‘ఫుల్ బాటిల్’, ‘రామ్ సేతు’తో పాటు ఓ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నా.