అగ్ర హీరో వెంకటేష్ మాటల్లో నిగూఢమైన ఆధ్యాత్మిక భావాలతో పాటు మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. జయాపజయాల గురించి పట్టింపు లేకపోయినా.. చేసే పనిలో వందశాతం అంకితభావం, నిబద్దత కనబరచాలన్నది ఆయన విశ్వసించే సిద్ధాంతం. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘దృశ్యం-2’ ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ దర్శకుడు. ఈ సందర్భంగా గురువారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ వెంకటేష్ చెప్పిన విశేషాలు..
తొలిభాగంలో కథానాయకుడు రాంబాబు ఎదుర్కొన్న సమస్యలు..వాటిని అతను ఎలా అధిగమించాడో చూశారు. రెండోభాగంలో కూడా రాంబాబుకు కుటుంబ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. తన కుటుంబాన్ని చుట్టుముట్టిన సమస్యల్ని తుదముట్టించడానికి అతను వేసే ఎత్తుగడలు ఆసక్తిగా అనిపిస్తాయి. రాంబాబు వేసే మాస్టర్ప్లాన్స్ ఎవరి ఊహకు అందకుండా ఉత్కంఠను పంచుతాయి. క్రైమ్ ఎలిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా ‘దృశ్యం’ ప్రేక్షకులకు థ్రిల్ను పంచింది. అంతకుమించిన సస్పెన్స్ సన్నివేశాలు, అనూహ్య మలుపులతో ఈ రెండోభాగం ఆకట్టుకుంటుంది.
తొలిభాగానికి మించిన ఉద్వేగాలుంటాయి. తన భర్త రాంబాబు ఎందుకు సంఘర్షణకు లోనవుతున్నాడు? నిజాల్ని ఎందుకు దాచిపెడుతున్నాడు? అనే అనుమానాలతో ఆయన భార్య, పిల్లలు పడే ఆవేదన… మరోవైపు ఎంతటి విపత్తు ఎదురైనా సరే కుటుంబాన్ని రక్షించుకోవాలనుకునే రాంబాబు తాపత్రయం ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటుంది. నిజం చెప్పాలంటే రాంబాబు క్యారెక్టర్ నా కెరీర్లోనే ది బెస్ట్ అనుకుంటున్నా.
మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని సన్నివేశాలను జతచేశాం. సినిమా చూసిన సెన్సార్వారు, ఇండస్ట్రీ సన్నిహితులు చాలా బాగుందని మెచ్చుకున్నారు. సినిమా రెండు భాగాల మధ్య ఆరేళ్ల విరామం వచ్చింది. అయినా కంగారుపడాల్సిన పనిలేదు. ‘దృశ్యం’ చిత్రం ఓటీటీ మాధ్యమంలో అందుబాటులో ఉంది. చూడాలనుకునే వారు చూడొచ్చు.
ఓ నిర్ణయంలోని మంచిచెడుల గురించి నేను పెద్దగా పట్టించుకోను. నా బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడం గురించే ఆలోచిస్తా. అప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలోనే తీసుకురావాలని నిర్మాతలు ఆలోచించారు. కరోనా ప్రభావం తగ్గినా ఇప్పటికీ కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. వారందరూ ఓటీటీలో హాయిగా ఈ సినిమాను ఆస్వాదించవొచ్చు. థియేటర్, ఓటీటీ ఏ వేదికైనా ప్రేక్షకులకు సినిమా చేరువ కావడం ముఖ్యమని నేను నమ్ముతాను. ఓటీటీ ద్వారా దేశవిదేశాల్లో ఉన్న లక్షలాది తెలుగువారు కూడా ఈ సినిమా చూసే వీలు దొరుకుతుంది. అదొక అడ్వాంటేజ్గా భావించాలి.
ఒక సినిమా విడుదలైన తర్వాత ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. కథ బాగా లేదనో..నా పర్ఫార్మెన్స్ బాగా లేదనో ఎవరైనా చెబితే తదుపరి సినిమాలో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. నేను కూడా స్వీయవిశ్లేషణతో తప్పులేమిటో తెలుసుకుంటా. విమర్శల్ని కూడా నేను పాజిటివ్ కోణంలోనే తీసుకుంటా.
మరొకరి వ్యక్తిగత నిర్ణయాల గురించి నేను మాట్లాడను. నా వరకు కథ నచ్చితే ఎలాంటి పాత్రనైనా సంతోషంగా చేస్తా. కెరీర్ గురించి పెద్దగా ఆలోచనలు, ఆకాంక్షలు ఏవీ లేవు. మనకు ఏది ఎప్పుడు ఎంతవరకు రావాలో అంతే వస్తుంది. భగవంతుడు మనకు ఏది అవసరమో అదే ఇస్తాడు.
నేను ఆ కోణంలో రీమేక్ సినిమాల గురించి ఆలోచించి హ్యాపీగా ఫీలవుతాను.
ప్రస్తుతం ఆ సిరీస్ షూటింగ్ జరుగుతున్నది. అందులో నా లుక్స్, పాత్ర చిత్రణ పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులు ఓ సర్ప్రైజ్లా ఫీలవుతారు. ఇక నా తదుపరి చిత్రం ‘ఎఫ్-3’ చిత్రీకరణ జరుగుతున్నది. రెండు షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. ఫస్ట్పార్ట్ కంటే మూడింతల వినోదంతో ఆ సినిమా నవ్వుల్ని పంచుతుంది. డబ్బు చుట్టూ తిరిగే సమస్యలు..అందులోంచి పుట్టే హాస్యంతో ‘ఎఫ్-3’ వినోదాల విందులా అనిపిస్తుంది.