# మాది కామారెడ్డి జిల్లా పిట్లం. అక్కడే పదో తరగతి వరకు చదివాను. ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అన్నయ్య, నాపై పడ్డాయి. ఓ వైపు కుటుంబానికి అండగా ఉంటూనే టెన్త్ పూర్తి చేశా. తర్వాత అన్నయ్య ప్రోత్సాహంతో కామారెడ్డిలో 1987-89 వరకు ఇంటర్ చదివాను. రోజూ కాలేజీకి వెళ్లేందుకు అవకాశం తక్కువ. చదువుపై పెద్దగా ధ్యాస పెట్టలేకపోయాను.
– దీంతో ఫస్టియర్ మ్యాథ్స్లో ఫెయిలయ్యాను. కుంగిపోకుండా మరింత కసిగా చదివి కాలేజీలో థర్డ్ ర్యాంకర్గా నిలిచాను. తర్వాత చదువులో ఎప్పుడూ వెనుకపడలేదు. గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోనే అలవాటు లేదు. చదివిన కొద్దిసేపైనా పూర్తి ఏకాగ్రతతో చదివాను.
– ఆ రోజుకు ఉన్న పరీక్షలో ఏది అవసరమో దాని ప్రకారం మెటీరియల్ను సేకరించుకుని చదవడం అలవాటు చేసుకున్నాను. బీఎస్సీలోనూ కాలేజ్ టాపర్గా నిలిచాను. చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ ఉద్యోగం సాధించాలని కోరిక ఉండేది.. కానీ ఎప్పుడు ఎవరి ముందు బయటపెట్టలేదు.
బీఎస్సీ పూర్తి చేసే సమయానికి కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీజీ చేయాలనే కోరిక ఉన్నా కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పుస్తకాలు కొనుక్కొని ప్రిపేరయ్యాను. దీంతో పీజీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో సీట్లు వచ్చాయి. నిజాం కాలేజీలో పీజీ ఎలక్టానిక్స్ పూర్తిచేశాను. 1994లో లాసెట్, బీఈడీ ఎంట్రన్స్ రాశాను. అదే సంవత్సరం గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుని చదివాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ఆర్థిక పరిస్థితుల వల్ల మెయిన్స్ రాయలేకపోయాను. తరువాత నాగార్జునసాగర్ ప్రభుత్వ కాలేజీలో బీఈడీ చేసి, డీఎస్సీ రాసి ఎస్జీటీ టీచర్గా చేరాను. పెండ్లి, ముగ్గురు అమ్మాయిలు ఇలా.. కుటుంబ బాధ్యతలు పెరిగాయి. అయినా 1998లో గ్రూప్-1కు దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్ పాసయ్యాను. 1999లో మెయిన్స్ రాశాను. కానీ రాలేదు. 2002లో జూనియర్ లెక్చర్గా ఎంపికయ్యాను. అయినా గ్రూప్-1పై ఆశ చావలేదు. 2004లో ప్రిలిమ్స్ పాసయ్యాను. కానీ కుటుంబ సమస్యలతో మెయిన్స్ రాయలేకపోయాను. 2007 నోటిఫికేషన్లో కామన్ సిలబస్ పెట్టారు. దీంతో ఎలాగైనా గ్రూప్స్ కొట్టాల్సిందేనని కుటుంబాన్ని ఊరిలో ఉంచి, హైదరాబాద్కు వచ్చి సీరియస్ గా చదివాను.
ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 10 మార్కులతో ఇంటర్వ్యూ మిస్సయ్యింది. అప్పటికే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఫౌండర్గా ఉద్యమంలో కీలకంగా పనిచేశాను. ఆ సమయంలో విశాఖపట్నానికి చెందిన మా కాలేజీ ప్రిన్సిపాల్తో వాగ్వాదం జరిగింది. ‘తెలంగాణ వాళ్లకు చదువు చేతగాదు, ఉద్యోగాలు సాధించే సత్తాలేదు, గ్రూప్-1 రాస్తే ఉద్యోగం వచ్చిందా? మీకు చదువుచేత కాదు అందుకే మాపై ఏడుస్తున్నరు’ అని ఎగతాళిగా మాట్లాడింది. ఆ మాటలతో పట్టుదలతో చదివి గ్రూప్-1 ఇంటర్వ్యూ వరకు రాగలిగాను. దీంతో గ్రూప్స్ సాధించగలననే నమ్మకం కలిగింది. అదే సమయంలో మళ్లీ గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. మెటీరియల్ కొనేందుకు కూడా డబ్బులు లేవు. బంగారు ఉంగరాన్ని తాకట్టుపెట్టి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రిపరేషన్ ప్రారంభించాను. ఆ సమయంలో నా భార్య ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. 2011 గ్రూప్-1లో జైళ్లశాఖలో డీఎస్పీగా ఉద్యోగం సాధించాను. తమిళనాడులో ట్రైనింగ్ పూర్తిచేశాను. అదే సంవత్సరం మళ్లీ గ్రూప్-1 నోటిఫికేషన్ పడింది. మళ్లీ దరఖాస్తు చేశాను. 15 రోజులు సెలవు పెట్టి మెయిన్స్ రాశాను. అంతగా ప్రిపేర్ కాలేదు కదా.. ఈసారి రాదనుకున్న. ఒక ఫ్రెండ్ రిజల్ట్ చూడమని చెబితే చూసి షాకయ్యాను. క్వాలిఫై అయి ఇంటర్వ్యూ కూడా పూర్తి చేశాను. కానీ అప్పుడేదో మీడియంల సమస్యతో ఆ ఎగ్జామ్ రద్దయ్యింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి నోటిఫికేషన్దే మళ్లీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారు. కానీ అప్పటికే సర్వీస్లో ఉండటం, బాధ్యతలు పెరగడంతో క్వాలిఫై కాలేకపోయాను. 2012లో జైళ్లశాఖలో డీఎస్పీగా విధుల్లో జాయినయ్యాను. ప్రస్తుతం చంచల్గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను.
– మనపైన మనం ఎప్పడూ విశ్వాసం కోల్పోవద్దు. అవకాశం ఉంటే ఈసారి కూడా నా కూతుళ్లతో కలిసి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలని ఉంది. ఉద్యోగం కోసం కాదు. ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకునేందుకు. అందుకే గ్రూప్స్కు ప్రిపేరవుతున్న వారికి చెప్పేది ఒక్కటే.. ప్లానింగ్తో ముందుకెళితే ఎన్ని సమస్యలు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
– ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా అలాగే చేద్దామనే మూస పద్ధతిలో కాకుండా మార్కెట్లో ఉన్న ఇన్స్టంట్ మెటీరియల్ను అందిపుచ్చుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం సాధించవచ్చు. పోటీపరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 9849763008 నంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
…నాగోజు సత్యనారాయణ