Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో ( Zomato ) కు షాక్ తగిలింది. ఆ సంస్థ కో-ఫౌండర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీవో) గుంజన్ పాటీదార్ కంపెనీకి రాజీనామా చేశారు. జొమాటో స్థాపించిన తొలి రోజుల్లో పని చేసిన కొద్ది మందిలో ఒకరిగా పాటిదార్ ఉన్నారని ఆ సంస్థ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
పదేండ్లకు పైగా సంస్థను సాంకేతికంగా ముందుకు నడిపే బృందానికి సారధ్యం వహించారని జొమాటో పేర్కొంది. కోర్ టెక్ సిస్టమ్ల నిర్మాణంలో కీలకంగా వహించారని తెలిపింది. సంస్థ ఎదుగుదలతో గుంజన్ పాటీదార్ సహకారం మరువలేనినది కొనియాడింది. కానీ, గుంజన్ పాటీదార్ రాజీనామాకు కారణాలను మాత్రం బయటపెట్టలేదు. గుంజన్ పాటీదార్ తమ సంస్థ కీలక మేనేజేరియల్ పర్సనల్ (కేఎంపీ) కాదని పేర్కొనడం గమనార్హం.
నాలుగున్నరేండ్ల క్రితం జొమాటోలో చేరిన మరో సంస్థ కో-ఫౌండర్ మోహిత్ గుప్తా గత నవంబర్లో సంస్థ నుంచి వైదొలిగారు. గత ఏడాది మోహిత్ గుప్తాతోపాటు పలువురు టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ల నిష్క్రమించారు. మోహిత్ గుప్తా వైదొలిగే నాటికి జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్కు సీఈవోగా ఉన్నారు.
గతేడాది నవంబర్లో మరో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా చేసిన 45 రోజులకే ఈ రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం.
మోహిత్ గుప్తాతోపాటు న్యూ ఇన్సియేటివ్ హెడ్గా పని చేసిన రాహుల్ గంజూ, ఇంటర్ సిటీ హెడ్ సిద్దార్థ్ జవార్, కో ఫౌండర్ గౌరవ్ గుప్తా వంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్లు గతేడాది వరుసగా కంపెనీని వీడారు.
ఇటీవలే సంస్థలో దాదాపు మూడు శాతం సిబ్బందిని తొలగించింది. రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికామని తెలిపింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర నష్టాలు రూ.250.8 కోట్లకు పరిమితం అయ్యాయి. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో జొమాటో నికర నష్టం రూ.434.9 కోట్లు. కానీ నిర్వహణ ఆదాయం మాత్రం 62.20 శాతం పెరిగి రూ.1,661.3 కోట్లకు పెరిగింది.