న్యూఢిల్లీ, మే 6: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ భూరి విరాళాన్ని ప్రకటించారు. తమ సంస్థ డెలివరీ పార్టనర్స్ పిల్లల చదువులకు సాయం చేసేందుకు 90 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 700 కోట్లు) విరాళం ఇవ్వనున్నారు. ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ద్వారా తనకు వచ్చిన రూ.700 కోట్ల విలువైన షేర్లను జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జేఎఫ్ఎఫ్)కు ఇవ్వనున్నట్టు కంపెనీ ఉద్యోగులకు ఒక ఇంటర్నల్ మెమోలో గోయల్ తెలిపారు. జొమాటోలో ఐదేండ్లకుపైగా సేవలు అందిస్తున్న డెలివరీ పార్టనర్ల పిల్లలు ఇద్దరికి..ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 50,000 చొప్పున సాయం అందిస్తారు. కంపెనీలో 10 ఏండ్లు సర్వీస్ పూర్తిచేసుకున్న పార్టనర్ల పిల్లలకు ఈ సహాయం రూ. 1 లక్ష వరకూ ఉంటుందని గోయల్ వివరించారు. అదే మహిళా డెలివరీ పార్టనర్లకు 5/10 ఏండ్ల సర్వీసుకంటే తక్కువ ఉన్నా ఈ సదుపాయం వర్తిస్తుంది. అలాగే బాలికలకు ప్రత్యేక పథకాలు ఉంటాయని, బాలిక ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నతర్వాత బహుమతిగా కొంత సొమ్ము అందించడం జరుగుతుందన్నారు.