న్యూఢిల్లీ, జనవరి 22: అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్.. జీ ఎంటర్టైన్మెంట్తో విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సోనీ గ్రూప్ తన ఇండియా యూనిట్ను జీ ఎంటర్టైన్మెంట్తో విలీనం చేసి, 10 బిలియన్ డాలర్ల (రూ.83,000 కోట్లు) విలువైన మెగా వినోద సంస్థను ఆవిర్భవింపచేసేందుకు రెండేండ్ల క్రితం సోనీ గ్రూప్ డీల్ కుదుర్చుకుంది.
ఈ డీల్ను రద్దుపర్చుకుంటూ జీకి తాజాగా సోనీ కార్పొరేషన్కు చెందిన సబ్సిడరీ సోనీ ఫిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ప్రస్తుత పేరు కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్) టర్మినేషన్ నోటీసు జారీచేసింది విలీన ఒప్పందంలోని నిబంధనల్ని ఉల్లంఘించినందుకు 90 మిలియన్ డాలర్ల (రూ.747 కోట్లు) బ్రేక్అప్ ఫీజు చెల్లించాలంటూ ఆ నోటీసులో జీ గ్రూప్ను డిమాం డ్ చేసింది. ఈ డీల్ పూర్తయితే 70కిపైగా టీవీ చానళ్లు, రెండు బాలీవుడ్ స్టూడియోలు, నెట్ఫ్లిక్స్, అమెజాన్తో పోటీపడే అపారమైన ఫిల్మ్ లైబ్రరీతో కూడిన పెద్ద వినోద దిగ్గజం ఏర్పడేది.
విలీనానికి ఎన్సీఎల్టీ, సీసీఐ, స్టాక్ ఎక్సేంజీలు, రుణదాతలు, షేర్హోల్డర్ల నుంచి వివిధ నియంత్రణా పరమైన అనుమతులు కూడా ఇప్పటికే వచ్చాయి. 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందం ప్రకారం విలీనం రెండేండ్లలోపు పూర్తికావాల్సి ఉంది. ఆ గడువు ముగిసిన తర్వాత మరో నెల పొడిగించారు. ఈ జనవరి 21తో గడువు ముగిసినప్పటికీ ఒప్పందంలోని షరతులు అమలుకాకపోవడం నిరుత్సాహకరమని సోనీ తెలిపింది. ఇండియాలో తమ ఉనికిని పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు జపాన్కు చెందిన సోనీ గ్రూప్ కార్పొరేషన్ ప్రకటించింది.
లీగల్ చర్యలు చేపడతాం:జీ
విలీన ఒప్పందాన్ని రద్దుచేసుకున్నందున ఏర్పడిన పరిణామాల నుంచి తమ భాగస్వాముల దీర్ఘకాలిక ప్రయోజనాల్ని సంరక్షించడానికి తగిన లీగల్ చర్యల్ని చేపడతామని జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. విలీన ఒప్పందం అమలుకోసం అవసరమైనవన్నీ చేశామని, సోనీ చేసిన ఆరోపణల్ని తిరస్కరిస్తున్నామని వివరించింది. డీల్ రద్దుతో ఇండస్ట్రీస్కు చెందిన ఎంటర్టైన్మెంట్ మీడియా లేదా వాల్డ్ డిస్నీతో విలీన అవకాశాల్ని జీ అన్వేషించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జీకి ప్రాంతీయ భాషల్లో ఉన్న అపారమైన కంటెంట్, డజన్లకొద్దీ టీవీ చానళ్ల నుంచి సోనీకి ఇక ప్రయోజనం లేనందున, ఈ జపాన్ సంస్థ సైతం భారత్ కార్యకలాపాలపై కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది.
రిస్క్లో క్రికెట్ ప్రసార హక్కులు
కొన్ని క్రికెట్ కప్ ఈవెంట్లను టీవీలో ప్రసారం చేసేందుకు డిస్నీ స్టార్తో జీ నాలుగేండ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పంద సమయంలో 1.32-1.44 బిలియన్ డాలర్ల మేర (రూ.12,000 కోట్ల వరకూ) డిస్నీకి జీ చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా విలీన ఒప్పందం రద్దుకావడంతో ఈ క్రికెట్ ప్రసార హక్కుల్ని జీ వదులుకునే రిస్క్ ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. జీ వద్ద ప్రస్తుతం నగదు నిల్వలు రూ. 600 కోట్ల మేరకే ఉన్నందున, ఈ చెల్లింపుల్ని చేయలేదని చెపుతున్నారు. వాస్తవానికి విలీన సంస్థలో రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడి చేసేందుకు సోనీ ప్రతిపాదించింది.
పునీత్ గోయెంకా వివాదమే కారణం
సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి విలీన సంస్థకు నాయకత్వం వహించేవారిపై ఏర్పడిన వివాదమే కారణమయ్యింది. ప్రస్తుత జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గోయెంకా విలీన కంపెనీ నుంచి వైదొలగాలంటూ సోనీ చేస్తున్న డిమాండ్ను జీ ఎంటర్టైన్మెంట్ తోసిపుచ్చుతున్నది. పునీత్ మార్కెట్లో ఫ్రాడ్స్కు పాల్పడ్డాయంటూ వచ్చిన ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో విలీన కంపెనీ నుంచి దూరంపెట్టాలంటూ సోనీ డిమాండ్ చేస్తున్నది. ఒప్పందం ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటా ఉంటుంది. కంపెనీ నుంచి నిధులు మళ్లించారన్న ఆరోపణలతో గోయెంకా ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్గా కొనసాగరాదంటూ గతంలో సెబీ నిషేధం విధించగా, ఈ ఉత్తర్వులపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. జపాన్లో కఠినమైన కార్పొరేట్ గవర్నెన్స్ అమలవుతున్నందున, విలీన సంస్థకు గోయెంకా నేతృత్వాన్ని సోనీ ఏ మాత్రం అంగీకరించడం లేదు.