Zee Re entry to Sports Broad Caste | ప్రముఖ టీవీ చానెల్ జీ న్యూస్ మరోమారు దీర్ఘకాలిక మీడియా ప్రసార హక్కుల కాంట్రాక్ట్ పొందింది. ఈ మేరకు యూఏఈ టీ-20 లీగ్ ప్రసార హక్కుల కాంట్రాక్ట్పై రెండు సంస్థలు మంగళవారం సంతకాలు చేశాయి. దీంతో క్రీడల ప్రసార హక్కుల విభాగంలోకి జీ న్యూస్ మళ్లీ ఎంటరైనట్లయింది. 2016లో జీ న్యూస్ తన టెన్ స్పోర్ట్స్ టెలివిజన్ నెట్వర్క్ను సోనీకి రూ.2,600 కోట్లకు విక్రయించింది. కానీ, తాజా నిర్ణయంతో మళ్లీ క్రీడల ప్రసార వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లయింది. యూఏఈ టీ-20 లీగ్ టోర్నీ పూర్తిగా జీ టెలివిజన్ చానెల్స్లోనే ప్రసారం అవుతుంది. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా జీ న్యూస్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్లోనే ప్రసారం అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా యూఏఈ టీ-20 లీగ్ ప్రసార హక్కుల విలువ, గడువును జీ న్యూస్ వెల్లడించలేదు. కానీ, మీడియా పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం పదేండ్ల పాటు రూ.800-900 కోట్లకు కాంట్రాక్ట్ కుదిరిందని భావిస్తున్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే యూఏఈ టీ-20 లీగ్లో ఆరు జట్లు పాల్గొంటారు. 34 మ్యాచ్ల టోర్నమెంట్ ఇది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ స్పోర్ట్స్లైన్, కోల్కతా నైట్ రైడర్స్, లాన్సర్ క్యాపిటల్, జీఎంఆర్ గ్రూప్, కాప్రి గ్లోబల్ ఫ్రాంచైసీలు ఆ జట్లకు సారధ్యం వహిస్తున్నాయి.
వచ్చేనెలలో యూఏఈ-టీ 20 లీగ్ ప్రారంభం కానున్నదని సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత ఫిబ్రవరిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. జీ న్యూస్ వంటి విశ్వసనీయ మీడియా భాగస్వామి తమ లీగ్తో అనుసంధానం కావడం సంతృప్తికరం అని యూఏఈ టీ-20 లీగ్ చైర్మన్ ఖలీల్ అల్ జరూనీ చెప్పారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ సౌత్ ఏషియా బిజినెస్ విభాగం ప్రెసిడెంట్ రాహుల్ జోహ్రీ మాట్లాడుతూ యూఏఈ టీ-20 ప్రసార హక్కులు పొందడం ఆనందంగా ఉందన్నారు.