న్యూఢిల్లీ, మార్చి 25: ఈ మార్చి 31కల్లా మీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) స్కీముల్లో ఉన్న పెట్టుబడికి నామినీని రిజిష్టర్ చేయకపోతే, 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంఎఫ్ యూనిట్లను విక్రయించి డబ్బు పొందలేరు. యూనిట్లు ఉండే డీమ్యాట్ ఖాతాలకు నామినీని జతచేయడానికి 2023 మార్చి 31 గడువుతేదీగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గతంలోనే ప్రకటించింది. ఈ సమాచారాన్ని తెలియపరుస్తూ డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు తాజాగా ఒక ఈ మెయిల్ చేసింది. ‘సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం మా ఫోలియోలో నామినీ/నామినీలు లేదా ఆప్ట్-అవుట్ డిక్లరేషన్ (నామినీని జతచేయనంటూ తెలియపర్చడం) లేకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి యూనిట్ల రిడెంప్షన్లు/బదిలీ తదితరాల్ని అనుమతించం’ అని ఇన్వెస్టర్లకు డీఎస్పీ ఫండ్ తెలిపింది.
ఇదే రీతిలో పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్లకు వ్యక్తిగత సమాచారాన్ని పంపిస్తున్నాయి. 2023, మార్చి 31కల్లా ఇన్వెస్టర్లు వారి డీమ్యాట్ ఖాతాకు నామినీని యాడ్ చేయకపోతే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని సెబీ గత ఏడాది ఫిబ్రవరిలో సర్క్యులర్ జారీచేసింది. నామినీని జతచేయడానికి ఆసక్తిలేని వారు ఎంఎఫ్ యూనిట్లు ఫ్రీజ్కాకుండా ఆప్ట్-అవుట్ డిక్లరేషన్ ఇవ్వవచ్చు. డీమ్యాట్ ఖాతాకు గరిష్ఠంగా ముగ్గుర్ని నామినేట్ చేయవచ్చు. తల్లి, తండ్రి, సోదరుడు, అక్కాచెల్లెళ్లు, కొడుకు కూతళ్లు, ఇతర వ్యక్తులు..ఎవరినైనా నామినీగా యాడ్ చేయవచ్చు. మైనర్ అయితే సంరక్షుడి వివరాలు ఇవ్వాలి. ఆన్లైన్లో ఫండ్ లేదా డీమ్యాట్ ఖాతాల్లో లాగిన్ అయ్యి, నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
నామినీని చేర్చేదిలా…
1. ఫండ్/డీమ్యాట్ ఖాతాకు లాగిన్ కావాలి
2. ‘ప్రొఫైల్ సెగ్మెంట్’లోకి వెళ్లి ‘మై నామినీస్’పై క్లిక్ చేయండి
3. ఇందులో ‘యాడ్ నామినీ’ లేదా ‘ఆప్ట్-అవుట్’ను ఎంచుకోండి
4. వివరాలు నింపి, నామినీ ఐడీ ప్రూఫ్ అప్లోడ్ చేయండి
5. ఆ ఖాతాలో నామినీకి చెందే శాతాన్ని ఎంటర్చేయండి
6. ఆధార్ ఓటీపీతో ఈ-సైన్ చేయండి. నామినీ వివరాలు ప్రాసెస్ అవుతాయి.