YesBank-Dish TV | యస్ బ్యాంక్పై ఎస్సెల్ గ్రూప్- జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర సీరియస్ అయ్యారు. శాటిలైట్ టీవీ బ్రాడ్కాస్ట్ సంస్థ డిష్టీవీ ఇండియాలో తన పాత్రేమిటో యస్ బ్యాంక్ డిసైడ్ చేసుకోవాలని సూచించారు. డిష్ టీవీ ఇండియాలో వాటాదారుగా ఉన్నారా లేక ఆ సంస్థకు రుణదాతగా ఉన్నారా తేల్చుకోవాలని స్పష్టం చేశారు. డిష్టీవీతో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి యస్ బ్యాంక్ యాజమాన్యానికి ఫ్యామిలీ సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపై నిర్ణయాధికారం యస్ బ్యాంక్కే వదిలేస్తున్నామన్నారు.
ఒకవేళ డిష్ టీవీ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు యస్ బ్యాంక్ సిద్ధంగా ఉంటే, ఆ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా రుణ దాతగా పరిగణిస్తే చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కూడా సిద్ధం అని సుభాష్ చంద్ర తెలిపారు.
డిష్ టీవీలో యస్ బ్యాంక్కు రూ.713 కోట్ల విలువైన 25.63 శాతం వాటాలు ఉన్నాయి. 2015-18 మధ్య 10 ఎస్సెల్ గ్రూప్ సంస్థలకు రూ.5,270 కోట్ల రుణాలిచ్చామని యస్ బ్యాంక్ చెబుతున్నది. డిష్ టీవీలో సుభాష్ చంద్ర కుటుంబానికి ఆరు శాతంవాటాలు ఉన్నాయి. రుణాల చెల్లింపులో విఫలం అయ్యాయని పేర్కొంటూ డిష్ టీవీలో సుభాష్ చంద్ర వాటాలను యస్ బ్యాంక్ జప్తు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఎస్సెల్ గ్రూప్కు రూ.4,200 కోట్ల రుణాలు మాత్రమే ఉన్నాయని, కానీ బ్యాంకు ఇతర గ్రూప్ రుణాలను కలిపి మొత్తం రూ.5,270 కోట్లుగా చూపుతున్నదని సుభాష్ చంద్ర వాదిస్తున్నారు. మేం మా సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులకు 91 శాతం చెల్లించేశాం. డిష్ టీవీలో యస్ బ్యాంక్ వాటా కంటే ఎక్కువ మొత్తం చెల్లించి, సమస్య పరిష్కరించుకునేందుకు సిద్ధం అని సుభాష్ చంద్ర తెలిపారు.