Yes Bank Scam | యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ భార్య, ఇద్దరు కూతుళ్లకు బెయిల్ ఇవ్వడానికి ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్తో క్విడ్ప్రో క్యూ కేసులో రాణా కపూర్ భార్య బిందు, కూతుళ్లు రాధాఖన్నా, రోషిణి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ యూ వాగ్గావోంకర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై సీబీఐ చార్జిషీట్లు నమోదు చేసింది. అంటే ఈ నెల 23 వరకు వారు జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
బిందు, ఆమె కూతుళ్లు రాధా ఖన్నా, రోషిణిల తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు విజయ్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కానీ న్యాయస్థానం అంగీకరించలేదు. అయితే, నిందితులకు ఆర్టీపీసీఆర్ నివేదికలు రాకుండా వారిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు.
డీహెచ్ఎఫ్ఎల్ అధినేత కపిల్ వాధ్వాన్తో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న అభియోగంపై రాణా కపూర్పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. 2018 ఏప్రిల్-జూన్ మధ్య యెస్ బ్యాంకులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) రూ.3,700 కోట్ల స్వల్ప కాలిక డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టింది. డీవోఐటీ అర్బన్ వెంచర్స్కు రుణాలిచ్చినందుకు ప్రతిగా కపూర్ భార్యా పిల్లల నియంత్రణలో ఉన్న సంస్థకు రూ.600 కోట్లు కపిల్ వాధ్వాన్ ముడుపులు చెల్లించారని అభియోగం.