WPI | మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం (WPI) స్వల్పంగా పెరిగింది. గత నెలలో 0.5శాతం పెరగ్గా.. అంతకు ముందు ఫిబ్రవరిలో 0.2శాతంగా ఉండేది. టోకు ద్రవ్యోల్బణం డేటాను కేంద్రం సోమవారం విడుదల చేసింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 0.20శాతం ఉండగా.. మార్చిలో వార్షిక ప్రాతిపదిక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 0.53శాతానికి ఎగిసింది.
టోకు ఉల్లి ధరలు ఫిబ్రవరిలో 29.22 శాతం పెరగ్గా.. మార్చిలో 56.99 శాతానికి పెరిగాయి. భారత్ ఉల్లి సరఫరాలో కొరత ఎదుర్కొంటున్నది. కాగా, బంగాళదుంపల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 15.34 శాతంతో పోలిస్తే మార్చిలో 52.96 శాతం పెరిగింది. గణాంకాల ప్రకారం, ఏడాది క్రితం మార్చి నెలలో.. ఉల్లి టోకు ధరలు 36.83 శాతం, బంగాళదుంప ధరలు 25.59 శాతం తగ్గాయి. అదే సమయంలో.. నెలవారీ ప్రాతిపదికన, ఫిబ్రవరిలో 0.11 శాతం పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 1.01 శాతం పెరిగింది. ఈ రెండింటి ధరలతో మార్చిలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగదల కారణంగా.. ఈ ఏడాది మార్చిలో ముడి పెట్రోలియం విభాగంలో ద్రవ్యోల్బణం 10.26 శాతం పెరిగినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠ స్థాయి 4.85 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం. మరో వైపు రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతానికి ఎగిసింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.