Rishi Sunak | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే తొలి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ తమ దేశంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొట్టమొదటి ‘అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్’ నిర్వహణకు బ్రిటన్ సిద్ధమైన నేపథ్యంలో రిషి సునాక్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. నవంబర్ 1-2 తేదీల్లో బకింగ్హమ్ షైర్లోని బ్లెట్ చ్లేయ్ పార్క్లో ఈ సదస్సు జరుగుతుంది.
రోజురోజుకో అడ్వాన్స్డ్ ఏఐ జనరేటివ్ టెక్నాలజీ వెలుగు చూస్తున్న నేపథ్యంలో వాటిలోని టెక్నాలజీని తాము ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్ స్టిట్యూట్ అధ్యయనం చేయడంతోపాటు లాభనష్టాలను పరిశీలిస్తుందన్నారు రిషి సునాక్. పారిశ్రామిక విప్లవం, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ జననం వంటి అంశాల మాదిరిగానే టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన తేవొచ్చునని రిషి సునాక్ పేర్కొన్నారు. కొన్ని ప్రయోజనాలతోపాటు కొంత భయం, ప్రమాదం ఉన్నా.. వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.