హైదరాబాద్, మే 17:ఒకే ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నది గ్రీన్కో గ్రూపు. కర్నూల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ బృహత్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. 3 బిలియన్ డాలర్లు(రూ.22 వేల కోట్లకు పైమాటే) పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ 5,230 మెగావాట్ల రెన్యువబుల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు 2023 చివరి నాటికి అందుబాటులోకి రానున్నది. దీంతోపాటు 10,800 ఎండబ్ల్యూహెచ్ హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది. ఈ పెట్టుబడుల్లో బిలియన్ డాలర్ల నిధులను స్టోరేజ్ కెపాసిటీ కోసం ఖర్చు చేయనుండగా, మిగతా 2 బిలియన్ డాలర్లతో 3 వేల మెగావాట్ల సౌర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, 550 మెగావాట్ల పవన్ విద్యుత్, 1,680 మెగావాట్ల హైడల్ పవర్ జనరేషన్ కెపాసిటీతో యూనిట్లను నెలకొల్పబోతున్నట్లు గ్రీన్కో గ్రూపు ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ కొల్లీ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రతియేటా 15 మిలియన్ టన్నుల కార్బన్డైయాక్సైడ్ తగ్గనున్నదని, ఇది 30 లక్షల కార్లు వదిలే పొగకు సమానమని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో నాలుగు విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, దీనికోసం 5 బిలియన్ డాలర్ల నిధులు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.