పర్యావరణ పరిరక్షణకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తామని నమ్మించారు. దీంతో ఆ గ్రూప్ సంస్థల్లో హరిత నిధులు వరదలాపారాయి. అయితే, పర్యావరణ పరిరక్షణపై ఇచ్చిన వాగ్ధానాలను ఆ గ్రూప్ కంపెనీలు తుంగలో తొక్కాయి. దీంతో అప్పటివరకూ ఆయా కంపెనీలకు ‘గ్రీన్’ గుర్తింపునిచ్చి, పెట్టుబడులు రావడానికి సహకరించిన దిగ్గజ ైక్లెమెట్ కంపెనీ ఎస్బీటీఐ.. ఆ గుర్తింపును రద్దు చేసింది. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో గుత్తాధిపత్యం చేపట్టాలనుకొన్న అదానీ గ్రూప్నకు తగిలిన తాజా షాక్ ఇదే.
Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ పేరిట వివిధ కంపెనీలను స్థాపించి నిధులను సేకరించిన అదానీ గ్రూప్.. నిబంధనలను ఉల్లంఘించింది. దీంతో ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న వాతావరణ పరిరక్షణ సంస్థ సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనీషియేటివ్ (ఎస్బీటీఐ).. అదానీ గ్రూప్నకు చెందిన మూడు కంపెనీల గుర్తింపును రద్దు చేసింది. ఎస్బీటీఐ ఆమోదం కోల్పోయిన కంపెనీల జాబితాలో అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ ఉన్నాయి. హానికర ఉద్ఘారాలను అరికట్టడంలో విఫలమవ్వడం, నిబంధనలను ఉల్లంఘిచడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఎస్బీటీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘బ్లూమ్బర్గ్’ ఓ కథనంలో వెల్లడించింది. భారత్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఎదుగుదామనుకొన్న అదానీ గ్రూప్నకు ఈ నిర్ణయం పెద్ద షాక్ అని ఆ పత్రిక అభివర్ణించింది.
పర్యావరణహిత, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే కంపెనీలు తొలుత ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ఎస్బీటీఐ ఆమోదం, గుర్తింపు, అనుమతులు ఉన్నాయో లేవో చూస్తాయని బ్లూమ్బర్గ్ తెలిపింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఇంపాక్ట్, వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ), వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ తదితర దిగ్గజ సంస్థలు ఎస్బీటీఐతో కలిసి వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాయి. కాగా ఎస్బీటీఐ గుర్తింపు రద్దుతో అదానీ గ్రూప్ కంపెనీలకు భవిష్యత్తులో రుణాలు సేకరించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే పదేండ్లలో దేశంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 8 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అదానీ గ్రూప్ పెట్టనున్నట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. తద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో గుత్తాధిపత్యం సాగించాలని అదానీ గ్రూప్ ఉవ్విళ్లూరుతున్నట్టు పలువురు విశ్లేషించారు కూడా. అయితే, ఎస్బీటీఐ తాజా నిర్ణయం నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆ మొత్తంలో రుణాలను ఎలా సమీకరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అదానీ సోదరుడు వినోద్ కంపెనీల గురించి తమకు తెలియదంటూ ఇంతవరకూ చెప్పుకొచ్చిన అదానీ గ్రూప్.. ఎట్టకేలకు నోరు విప్పింది. ఆస్ట్రేలియాలోని ‘కార్మికాయెల్ బొగ్గు గని’ నుంచి పోర్టుకు బొగ్గును సరఫరా చేసేందుకు ఉద్దేశించిన రైలు ప్రాజెక్టులో జాయింట్ వెంచర్ పార్ట్నర్, సహ యజమానిగా వినోద్ ఉన్నట్టు వెల్లడించింది.
బొగ్గు రంగంలో వేళ్లూనుకొన్న అదానీ గ్రూప్.. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ స్థాపన పేరిట పెద్దయెత్తున నిధులను అక్రమంగా రాబట్టుకొన్నది. గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ను చూపించి కోల్మైనింగ్ కంపెనీల కోసం పెట్టుబడులను సేకరించింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలో ‘బ్లూమ్బర్గ్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. కాలుష్యం వెలువడే, పర్యావరణానికి నష్టం కలిగించే ప్రాజెక్టులను మొదలుపెట్టబోమని హామీనిచ్చే కంపెనీ షేర్లను మాత్రమే ఈఎస్జీ మార్కెట్స్ కొనుగోలు చేస్తుంది. తాము గ్రీన్ ఎనర్జీ స్థాపనకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రీన్, టోటల్ గ్యాస్ కంపెనీలు నమ్మబలకడంతో అదానీ సంస్థల్లో ఈఎస్జీ, నార్వేకు చెందిన అతిపెద్ద పెన్షన్ ఫండ్ కేఎల్పీ పెద్దమొత్తంలో పెట్టుబడులు కుమ్మరించాయి. అయితే, అదానీ కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని ‘కార్మికాయెల్ బొగ్గు గని’ పనుల కోసం ‘గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ నిధులను వాడిందని తెలియడంతో పెద్దయెత్తున వివాదం రేగింది.