న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: జీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటున్న వేళ.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో మరికొద్ది నెలలు భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు వచ్చిపడ్డాయని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అన్నది. అయితే మరోసారి లాక్డౌన్లను అమల్లోకి తెచ్చేందుకు రాష్ర్టాలు అయిష్టంగా ఉన్నందున గతేడాది ఏప్రిల్-జూన్తో పోల్చితే ఈసారి దేశ ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని శుక్రవారం ఈ గ్లోబల్ సంస్థ అంచనా వేసింది. అయినప్పటికీ కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగి, ప్రజల ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకర స్థాయిలో దిగజారితే.. కఠిన ఆంక్షలు మళ్లీ అమల్లోకి వచ్చే వీలు లేకపోలేదని హెచ్చరించింది. ఇదే జరిగితే ఈ ఏడాది ప్రథమార్ధంలో తమ కనీస వృద్ధి అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉందన్నది. కాగా, భారత్లో వ్యాక్సినేషన్ రేటు చాలా తక్కువగా ఉందని, కరోనా అడ్డుకట్టకు ఇది సరిపోదని ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వ్యాఖ్యానించింది.
రికవరీకి కష్టాలు: ఫిచ్
కొవిడ్-19 సెకండ్ వేవ్ కేసులు.. భారతీయ ఆర్థిక పురోగతికి బ్రేకులు వేస్తున్నాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభిప్రాయపడింది. ఈ మహమ్మారి గతేడాది సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను.. మళ్లీ పెరుగుతున్న కేసులు కష్టాల్లోకి నెడుతున్నాయన్నది. బ్యాంకింగ్ వ్యవస్థకూ కరోనా సెగ గట్టిగానే తగులుతున్నట్లు చెప్పింది.