Omicron Impact | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ దేశీయ ఐటీ దిగ్గజాలపై బాగానే పడినట్లు కనిపిస్తున్నది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యాలయాలను మూసివేయనున్నట్లు సంస్థ సీఈవో థెర్రీ డెలాపోర్టే చెప్పారు. వచ్చే నాలుగు వారాల పాటు విప్రో కార్యాలయాలు పని చేయవు. ఈ సమయంలో సిబ్బంది మొత్తం వర్క్ ఫ్రం హోం సేవలందించాల్సి ఉంటుంది. నాలుగు వారాల తర్వాత పరిస్థితిని అంచనా వేసిన తర్వాత సిబ్బందిని వర్క్ ఫ్రం ఆఫీసుకు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుత ఆర్థికసంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను విప్రో సీఈవో థెర్రీ డెలాపోర్టే వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలన్నీ రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రం హోం పాలసీ అమలు చేస్తున్నాయి. గతేడాది కరోనా కేసులు తగ్గినట్లు కనిపించడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫీలతోపాటు కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత నెలాఖరులో.. ఈ నెల ప్రారంభంలో ఆఫీసులు తెరవాలని ప్లాన్లు వేశాయి. కానీ, అకస్మాత్గా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో 2022లోనూ ఆఫీసులను మూసేశాయి. 10 శాతం మంది సిబ్బందిని మాత్రమే ఆఫీసులకు రావాలని గత నెలలో టీసీఎస్ కోరింది.