న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి రెడీ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈవో థిర్రీ డెలాపోర్ట్ మాట్లాడుతూ..వచ్చే మార్చి నాటికి 38 వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు చెప్పారు. వలసలు భారీగా పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నదని, దీనిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రతి మూడు నెలలకొకసారి సిబ్బందికి ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు, అలాగే ఈ సెప్టెంబర్లో వేతనాలు పెంచబోతున్నట్లు చెప్పారు. తొలి త్రైమాసికంలో సంస్థ నికరంగా 15 వేల మందిని తీసుకోగా, వీరిలో 10 వేల మంది ఫ్రెషర్లే. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,58,574కి చేరింది.
జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 21 శాతం తగ్గి రూ.2,563.6 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇది రూ.3,242.6 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 18 శాతం అధికమై రూ.21,528.6 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.