Wipro | ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) ఫ్రెషర్స్ ( freshers)కు షాక్ ఇచ్చింది. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ (email) పంపింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్లను అంగీకరించాలని కోరింది.
2022-23 వెలాసిటీ గ్రాడ్యుయేషన్ కేటగిరీలో (Velocity graduates program) శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని 2023 మార్చి నుంచి రోల్స్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించనుంది. అయితే వేతన ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని విధుల్లో చేరాల్సిందిగా వాళ్లను కోరింది. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో (Wipro) పేర్కొంది. ఈ ఆఫర్కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని తెలిపింది. కాగా, శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని విప్రో ఇంటికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వేతన తగ్గింపుతో షాకిచ్చింది.