Mukesh Ambani | ఈ-కామర్స్ రంగంలో పట్టు కోసం వడివడిగా ముందుకు సాగుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి బ్రిటన్కు చెందిన డ్రగ్స్ స్టోర్ టేకోవర్పై గట్టి పోటీ ఎదురవుతున్నది. గుజరాత్ సంతతికి చెందిన ఇద్దరు బ్రిటన్ సోదరులు (ఈషా బ్రదర్స్) నుంచి ముకేశ్ అంబానీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న డ్రగ్స్ స్టోర్.. బూట్స్ విక్రయానికి దాని యాజమాన్య సంస్థ వాల్గ్రీన్స్ బూట్స్ అలయెన్స్ బిడ్లు ఆహ్వానించింది. ముందుగా చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 16తో గడువు ముగిసినా.. దాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. వాల్గ్రీన్స్ బూట్స్ యాజమాన్యం 8.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.65,865 కోట్లు) బిడ్లు ఆహ్వానించింది.
తమ ఆకాంక్షలకు అనుగుణంగా బూట్స్ డ్రగ్స్ డీల్ ఉందని ఈషా బ్రదర్స్ భావిస్తున్నారు. ఈషా బ్రదర్స్ ఇంతకంటే ఎక్కువ బిడ్ ఆఫర్ చేశారని సమాచారం. ఈ డీల్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద టేకోవర్ డీల్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈషా బ్రదర్స్ మూలాలు భారత్ నుంచి బ్రిటన్కు వెళ్లి స్థిరపడిన గుజరాతీ ముస్లింలు బారుచ్లవని తెలుస్తున్నది. మోహ్సిన్ ఈషా, జుబేర్ ఈషా ప్రస్తుతం యూరప్లోనే అతిపెద్ద పెట్రోల్ పంప్ కంపెనీ యూరో గ్యారెజెస్ నడుపుతున్నారు. బ్రిటిష్ సూపర్ మార్కెట్ చైన్ కంపెనీ ఆస్డా, రెస్టారెంట్ చైన్ కంపెనీ ఇయాన్ కలిగి ఉన్నారు.
అచ్చు ముకేశ్ అంబానీ మాదిరిగానే ఇతర సంస్థలను టేకోవర్ చేయడం ద్వారా ఈషా బ్రదర్స్ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని తహతహలాడుతున్నారు. అందుకోసం బూట్స్ డ్రగ్స్ స్టోర్స్ స్వాధీనంపై వెనక్కు తగ్గొద్దని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ డీల్ పూర్తయితే, అందుకు అవసరమైన నిధుల కోసం ఆస్డా పేరుతో రుణాలు సేకరించడం, కొన్ని సంస్థ ఆస్తులు విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.