న్యూఢిల్లీ, జూన్ 27: ప్రస్తుతం వ్యాపార నిర్వహణా వాతావరణం ఒడిదుడుకులమయంగా ఉందని, ద్రవ్యోల్బణం అధికస్థాయిలోనే కొనసాగితే అన్ని రంగాల డిమాండ్ తగ్గిపోతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సోమవారంనాడిక్కడ టాటా కన్జూమర్ ప్రాడక్ట్స్ (టీసీపీఎల్) వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్హోల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా అవాంతరాలు, క్రూడ్, పలు కమోడిటీల్లో డిమాండ్-సరఫరాల మధ్య అసమతౌల్యం అధిక ద్రవ్యోల్బణానికి కారణాలన్నారు. ఈ అనిశ్చితి వాతావరణానికి తగినరీతిలో తాము పనిచేయాల్సి ఉందని, అందుబాటులో ఉన్న అవకాశాల్ని చేజిక్కించుకోవాల్సి ఉందని ఆయన సూచనాప్రాయంగా చెప్పారు. టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా కెమికల్స్ విలీనంతో ఏర్పడిన టీసీపీఎల్ ప్రస్తుతం దేశంలో 26 లక్షల అవుట్లెట్స్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నది. కంపెనీ ఉత్పత్తులు 20.1 కోట్ల ఇళ్లకు చేరుతున్నాయి.