ఆకాశమే హద్దు అన్నట్టు ధరలు దూసుకుపోతున్నాయి.పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బతుకు భారమైపోతున్నది. సగటు మనిషికి ఏం తినాలో.. ఏం కొనాలో అర్థం కాని దుర్భర పరిస్థితి. ఠారెత్తిస్తున్న పెట్రో ధరల నడుమ పండ్లు, కూరగాయల దగ్గర్నుంచి సబ్బులు, బట్టలు అన్నింటి విలువ అమాంతం పెరిగింది. కేంద్రం విడుదల చేసిన టోకు ద్రవ్యోల్బణం ఇందుకు అద్దం పడుతున్నది.
న్యూఢిల్లీ, మే 17: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. మునుపెన్నడూ లేనివిధంగా గత నెల ఏప్రిల్లో 15.08 శాతంగా నమోదైంది. ప్రస్తుత 2011-12 సిరీస్ (ధరల ఆధారం)లో ఇదే అత్యధికం. అలాగే గత సిరీస్ ప్రకారం 17 ఏండ్ల గరిష్ఠం. ఇక ద్రవ్యోల్బణ గణాంకాలు రెండంకెల స్థాయిలో కదలాడటం వరుసగా ఇది 13వ నెల. ఈ ఏడాది మార్చిలో 14.55 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ.. నిరుడు ఏప్రిల్లో 10.74 శాతంగా ఉన్నట్టు మంగళవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశాన్నంటిన పండ్లు, కూరగాయలు తదితర ఆహారోత్పత్తుల ధరలు ఎంతకీ దిగిరావడం లేదు. ఆహారం, ఇంధనం, తయారీ ఇలా చెప్పుకుంటూపోతే అన్ని రంగాల్లో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకున్నది. ముఖ్యంగా ఇంధనం, విద్యుత్తు ధరలు మోత మోగిస్తున్నాయి.
ఆహార ద్రవ్యోల్బణం 8.35%
కూరగాయలు, గోధుమలు, పండ్లు, ఆలుగడ్డ ధరల ధాటికి ఆహార ద్రవ్యోల్బణం గత నెల ఏకంగా 8.35 శాతంగా నమోదైంది. ముఖ్యంగా కూరగాయల ధరల్లో 23.24 శాతం పెరుగుదల కనిపిస్తే, ఆలుగడ్డ 19.84 శాతం, పండ్లు 0.89 శాతం, గోధుమల ధరలు 10.7 శాతంగా పెరిగాయి. ప్రధాన ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెల 11.1 శాతానికి ఎగిసింది. మార్చిలో ఇది 10.9 శాతంగా ఉన్నది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం సైతం 10.7 శాతం నుంచి 10.9 శాతానికి ఎగబాకింది.
మళ్లీ వడ్డీరేట్ల పెంపు
కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లూ వృద్ధిరేటు బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగిన ఆర్బీఐ.. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపే ధ్యేయంగా వెళ్తున్నది. ఈ క్రమంలోనే ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్న గణాంకాలను కట్టడి చేసేందుకు అత్యవసర ద్రవ్యసమీక్ష నిర్వహించి అనూహ్యంగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా గణాంకాల మధ్య వచ్చే నెల జరిపే సమీక్షలో మరోసారి వడ్డింపులు ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే గృహ, ఆటో తదితర రుణగ్రహీతలపై మరింత భారం పడకతప్పదు.
పారిశ్రామిక వినియోగం ఆపాలి
వంటనూనెల ధరలు లీటర్ రూ.200 దాటిన నేపథ్యంలో పరిశ్రమల్లో వాటి వినియోగాన్ని ఆపేయాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) చెప్తున్నది. దేశీయ వంటనూనెల వినియోగంలో రంగుల తయారీ సంస్థలదే 23 శాతం వాటా అని ఐసీఏఆర్ ఆయిల్సీడ్స్ పప్పుధాన్యాల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. పెయింట్స్, వార్నీష్ ఇతర ఉత్పత్తుల తయారీకి వంటనూనెల్ని ఆయా సంస్థలు వాడుతున్నాయని చెప్పారు.
ద్రవ్యోల్బణం తగ్గితేనే వృద్ధి
తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణమే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. మెరుగైన మౌలిక సదుపాయాలు సైతం జీడీపీని బలపరుస్తాయని మంగళవారం విడుదలైన ఆర్బీఐ బులెటిన్లో వచ్చిన ఆర్టికల్ స్పష్టం చేసింది. ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరుతో వచ్చిన ఈ ఆర్టికల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న అవాంతరాలు, ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకులు తదితర అంశాలపై ఆర్బీఐ స్పందించింది.
మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ముడి చమురు, సహజ వాయువు, ఆహారోత్పత్తులు, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాలు. సంబంధిత వస్తువుల ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తున్నది.
– కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ