WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్లకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం తన ఆండ్రాయిడ్ యాప్లో కొత్తగా వీడియో కాలింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ తెస్తున్నది. అందులో భాగంగా వాట్సాప్ స్క్రీన్ కింద కొత్త టాబ్ ఏర్పాటు చేయనున్నది. ఇంతకుముందు జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్లో వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నది. ఇప్పటికే మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ తదితర ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. తాజాగా వీడియో కాలింగ్ వేళ ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్ తెస్తున్నది. ప్రస్తుతం బీటా యూజర్ల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నారు. త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
యూజర్లు తమ బంధు మిత్రులతో వీడియో కాలింగ్ సమయంలో వారి మొబైల్ స్క్రీన్ అవతలి వ్యక్తులకు షేర్ చేయడమే ఈ ఆప్షన్ ఉద్దేశం.. వాట్సాప్ కూడా తన యాప్ ద్వారా యూజర్లకు ఇదే ఫీచర్ తెస్తున్నది. స్క్రీన్ కింద కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్ అందిస్తున్నది. ఈ బటన్ క్లిక్ చేస్తే సరి.. మీ ఫోన్ లో చేసేది ప్రతిదీ రికార్డు అవుతుంది. అవతలి వ్యక్తికి కూడా షేర్ అవుతుంది. అయితే ఇలా వీడియో కాలింగ్ రికార్డు చేయడానికి యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
ఈ ఫీచర్ పాత ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్లు, పాత వాట్సాప్ వర్షన్లలో పని చేయకపోవచ్చు. అంతేకాదు.. ఎక్కువ సంఖ్యలో గ్రూప్ వీడియో కాలింగ్ చేస్తున్నప్పుడు కూడా స్క్రీన్ షేరింగ్ ఫీచర్ పని చేయదని సమాచారం. బీటా యూజర్లు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రావచ్చునని భావిస్తున్నారు. ఇక వాట్సాప్ యూజర్లు తమ ఖాతాలకు యూజర్ నేమ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తేనున్నది.