Work from Office | మళ్లీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ మోడల్ విధానంపై భారత్ కార్పొరేట్ దిగ్గజాలు వెయిట్ అండ్ సీ (వేచిచూసే) ధోరణిని అవలంభిస్తాయి. భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, ఎర్రిక్సన్, హ్యుండాయ్, ఫ్లిప్కార్ట్, జొమాటో, హోండా కార్స్ ఇండియా, టెక్ మహీంద్రా, శ్యామ్సంగ్, ఉబర్, నెస్ట్లే, ఎంఫేసిస్, పనాసోనిక్ ఇండియా, క్యాష్ కరో ఇండియా, అప్గ్రాడ్, అపోలో టైర్స్, వొడాపోన్ ఐడియా, కేపీఎంజీ తదితర సంస్థల ప్రతినిధులు స్పందిస్తూ వివిధ రాష్ట్రాల మార్గదర్శకాలతోపాటు పరిస్థితిని బట్టి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
చెన్నైలోని టెక్ సంస్థలు ఫ్లెక్సిబుల్ అప్రోచ్ పాలసీ అమలు చేయబోతున్నాయి. గ్లోబల్ సాస్ కంపెనీ చార్జ్ బీ స్పందిస్తూ చెన్నైతోపాటు ఇతర నగరాల్లో తమ సంస్థలో పని చేస్తున్న వారు ఎక్కడి నుంచైనా పని చేయొచ్చునని వ్యాఖ్యానించింది. చెన్నైలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహా 17 ఐటీ సంస్థలు సేవలందిస్తున్నాయి. ఐటీ సంస్థలన్నీ తమ సిబ్బంది, ఎగ్జిక్యూటివ్లతో సంప్రదిస్తూ సొంత పని విధానాన్ని రూపొందించుకుంటున్నాయి.
తమ ఆఫీసుల్లో కఠినమైన కొవిడ్-19 సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తామని ఎయిర్టెల్ తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. రెండేండ్లుగా అమలు చేస్తున్న హైబ్రీడ్ మోడల్నే ఇప్పుడూ కొనసాగిస్తామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. కొంత మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం ఆఫీసుకు, మరికొందరిని వర్క్ ఫ్రం హోం సేవలకు అనుమతిస్తామని వెల్లడించింది.
హ్యూండాయ్ మోటార్స్ స్పందిస్తూ రోజువారీ పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. ఫిజికల్గా పని చేసే ఎగ్జిక్యూటివ్ల నిష్పత్తిపై చర్యలు తీసుకుంటామన్నది. గుర్గావ్, చెన్నైల్లోని కార్యాలయాల్లో కొవిడ్-19 ప్రొటోకాల్స్ అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా కొవిడ్-19 ప్రొటోకాల్స్పై నిర్ణయం తీసుకుంటామని ఫ్లిప్కార్ట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందిస్తూ న్యూ వేరియంట్ సోకిన వారిలో అతి తక్కువ మంది దవాఖాన పాలవుతున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేశారు. అయితే, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఆఫీసులకు రావొద్దని సూచించారు. మరికొన్ని వారాలు వర్క్ ఫ్రం హోం మళ్లీ తప్పనిసరిగా కొనసాగనుందన్నారు. కనుక ఇందుకోసం వర్క్ హోం స్టేషన్లను సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఇక ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీ నెస్ట్లే కూడా హైబ్రీడ్ మోడల్ పని పద్దతినే పాటిస్తున్నది. అత్యవసరమైన ప్రణాళికలను అమలు చేయడానికి మాత్రమే సిబ్బంది ఆఫీసులకు రావాలని సూచించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2380 కొత్త కరోనా కేసులు నమోదుకాగా, యాక్టివ్ కేసులు 13,433కి పెరిగాయి. ఢిల్లీ, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి.
అపొలో టైర్స్, పనాసోనిక్ ఇండియా వంటి సంస్థల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పులు వస్తే, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే తదనుగుణంగా సిబ్బంది వారి పని విధానాన్ని మార్చుకోవాలని సూచించాయి.