న్యూఢిల్లీ, జూలై 27: భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని ఫ్రాన్స్ బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల దిగ్గజం సొసైటీ జనరల్ విశ్లేషించింది. ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యంత బలహీనంగా కూడా ఉందంటూ ఓ నివేదికలో పేర్కొన్నది. అధిక ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, కరెంట్ ఖాతా లోటు.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని అభిప్రాయపడింది. తగ్గుతున్న దేశ జీడీపీ అంచనాలు సైతం ఇందుకు అద్దం పడుతున్న విషయం తెలిసిందే. ఇక ‘థాయిలాండ్, ఫిలిప్పీన్స్ ఆర్థిక వ్యవస్థలు సైతం ఇబ్బందుల్లో ఉన్నాయంటూ ఈ సందర్భంగా భారతీయ ఆర్థికవేత్త కునాల్ కుమార్ కుందు, అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యూహకర్త విజయ్ విక్రమ్ కన్నన్లు అన్నారు.
అయితే ఇండోనేషియా, మలేషియా దేశాల ఆర్థిక వ్యవస్థలు అత్యంత స్థితిస్థాపకతను ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఎగుమతులు జోరుగా సాగుతుండటం ఈ దేశాలకు కలిసొస్తున్నదని తెలిపారు. ఈ విషయంలో చైనా సైతం ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్టు వెల్లడించారు. ఇండోనేషియా, మలేషియా, చైనా, తైవాన్, వియత్నాం, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, భారత్ ఎకానమీ తీరుతెన్నులపై సొసైటీ జనరల్ విశ్లేషణల్ని విడుదల చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ప్రమాదంలో పడుతున్న వృద్ధిరేటు ఆధారంగా ఈ 10 దేశాలకు ర్యాంకులను ఇచ్చింది. ఇందులో భారత్ ఆఖర్లో నిలిచింది.
వడ్డీరేట్లు 0.85% పెరగొచ్చు
రాబోయే రెండు ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను భారీగా పెంచవచ్చన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కుందు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రెపోరేటు 85 బేసిస్ పాయింట్లు పెరిగే వీలున్నదన్నారు. ద్రవ్యోల్బణం శాంతిస్తేగానీ వృద్ధిరేటుపై ఆర్బీఐ మళ్లీ దృష్టి సారించకపోవచ్చన్నారు. కాగా, ఇంతకుముందు ఓ ప్రముఖ జాతీయ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై కుందు ఆందోళన వెలిబుచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఎదుర్కొంటున్న ఒత్తిడి.. భారత జీడీపీ వృద్ధి అవకాశాల్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో పడిపోయిన డిమాండ్ సైతం వృద్ధిరేటును వెనక్కి లాగుతున్నదన్నారు.