న్యూఢిల్లీ, నవంబర్ 24: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా.. ఎంపిక చేసిన ఎక్స్సీ90, ఎక్స్సీ60, ఎక్స్సీ40 రీచార్జి మోడళ్ళ ధరలను 1.8 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎక్స్సీ 40 రీచార్జ్ మోడల్ రూ.55.9 లక్షల నుంచి రూ.56.9 లక్షలకు చేరుకోనుండగా, ఎక్స్సీ 60 రూ.66.5 లక్షలకు, ఎక్స్సీ90 మోడల్ రూ.94.9 లక్షల నుంచి రూ.96.5 లక్షలకు చేరుకోనున్నది. కానీ, ఎస్90 పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్, ఎక్స్సీ40 పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ళను ఈ ధరల పెంపు నుంచి మినహాయింపునిచ్చింది.