న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)కు మంగళవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. వొడాఫోన్ ఐడియాలో తన వాటాను ప్రభుత్వం సూచించిన సంస్థకు అమ్మేందుకు సిద్ధమని వీఐఎల్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఈ సంగతి బయటపడటంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,700 కోట్ల మేరకు కోల్పోయింది.
12 శాతం నష్టపోయిన వొడాఫోన్ ఐడియా
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో వొడాఫోన్ ఐడియా స్క్రిప్ట్ 12 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగియడానికి ముందు రికవరీ సాధించింది.
శరవేగంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా పయనిస్తుందన్న అంచనాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఐ) సూచీ సెన్సెక్స్, అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ నిఫ్టీ లాభ పడి రికార్డులు నమోదు చేశాయి.
ఇదీ వొడాఫోన్ ఐడియా పరిస్థితి
కేంద్ర ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) రూ.50 వేల కోట్ల పై చిలుకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రూ.21,264 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్నది వొడాఫోన్ ఐడియా. మంగళవారం పతనంతో ఏజీఆర్ బకాయిలు రెట్టింపయ్యాయి.