న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ప్రస్తుతం అందిస్తున్న 4జీ సర్వీసుల్ని పటిష్టపర్చుకోవడంతోపాటు ఇప్పటికే జాప్యం జరిగిన 5జీ సర్వీసులకు ప్రారంభించడానికి అవసరమైన భారీ నిధుల్ని సమీకరించడానికి వొడాఫోన్ ఐడియా సిద్ధమయ్యింది. మంగళవారం సమావేశమైన కంపెనీ బోర్డు ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లను జారీచేసి రూ. 20,000 కోట్లను సమీకరించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రత్యర్థి కంపెనీలు జియో, భారతి ఎయిర్టెల్లు ఆఫర్ చేస్తున్న సర్వీసులకు ధీటుగా అందించడానికి మొత్తం ఈక్విటీ, డెట్ రూపంలో కలిపి రూ. 45,000 కోట్లు సేకరించాలని బోర్డు నిర్ణయించింది.
వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం ఈక్విటీ వాటా ఉన్న సంగతి తెలిసిందే. త్రైమాసిక నష్టాలను తెచ్చుకుంటూ, ఏ నెలకు ఆ నెల చందాదారులను కోల్పోతూ రూ.2.1 లక్షల కోట్ల రుణభారంతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా భారీ నిధుల సమీకరణ లక్ష్యాన్ని పెట్టుకోక తప్పలేదు. అయితే ప్రమోటర్లు ఎంత ఈక్విటీని పెట్టుబడి చేస్తారన్నది కంపెనీ వెల్లడించలేదు. డిసెంబర్ చివరినాటికి ఈ కంపెనీ చందాదారుల సంఖ్య 22.30 కోట్లకు తగ్గింది.