హైదరాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. జనవరి 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు వీఎల్ఎస్ఐ డిజైన్ కాన్ఫరెన్స్ 2023 జరగనున్నది. 36వ సారి జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్తోపాటు 30కి పైగా అంతర్జాతీయ ఇండస్ట్రీ నిపుణులు హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో సెమికండక్టర్లు, వీఎల్ఎస్ఐ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 2 వేలకు పైగా అంతర్జాతీయ డెలిగేట్లతోపాటు సెమికండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్, పరిశోధన, ఇన్నోవేటర్లు హాజరుకాబోతున్నారు.