హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ. 250 కోట్ల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ పనులను మంత్రి శ్రీనివాస్యాదవ్,విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, డెయిరీ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పాడి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా విజయ డెయిరీ నష్టాల పాలై మూసివేసే దశకు చేరుకుందని తెలిపారు.
పాడి రైతులకు ప్రోత్సాహకాలు
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. 1500 లీటర్లు అంతకన్నా ఎకువ పాలు పోసే పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలు, పాల క్యానులు, సబ్సిడీ ద్వారా దాణా, మినరల్ మిక్చర్, విద్యుత్ సబ్సిడీ, బీమా, సబ్సిడీ కల్పిస్తున్నట్లు పేరొన్నారు. ఇవే కాకుండా 1962 నెంబర్కు కాల్ చేస్తే జీవాల వద్దకే వచ్చి వైద్య సేవలు అందించే విధంగా సంచార పశువైద్యశాలలను ఏర్పాటు చేసినట్లు పేరొన్నారు. చిన్నకారు రైతులకు, మహిళా ఉత్పత్తిదారులకు పాడి పశువుల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, శ్రీనిధి బ్యాంకు, నాబార్డ్ల ద్వారా ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో రైతులకు రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్యాదవ్ వివరించారు. మంత్రి వెంట ఎన్డీడీబీ ఇంజనీరింగ్ విభాగం జీఎం సునీల్ సిన్హా, శశికుమార్ ఉన్నారు.