న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారత టెలికం రంగంపై ఉన్నంత అధిక సుంకాలు ప్రపంచంలో మరెక్కడా లేవని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా ఆరోపించారు. దేశీ టెలికం పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 58 శాతం స్పెక్ట్రం చెల్లింపులు, పన్నులకే సరిపోతుందని వాపోయారు. సోమవారం ఇక్కడ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 18 శాతం జీఎస్టీ, 12 శాతం లైసెన్సు ఫీజు/స్పెక్ట్రం యూజర్ చార్జీలు కలిపి 30 శాతం సుంకాలు అందరికీ కన్పించేవేనని, స్పెక్ట్రం ధరలో మాత్రం కన్పించని పన్ను పోటు ఉంటుందని చెప్పారు. స్పెక్ట్రంకు చెల్లించిన ధరను యాన్యుటీ విలువగా మార్చి లెక్కిస్తే అందులో 28 శాతం పరిశ్రమకు అదనపు భారం ఉంటుందని వివరించారు. టెలికం ఆపరేటర్లు నగదు రాబడిని పెంచుకుని, అధిక మూలధనం అవసరమైన 5జీ నెట్వర్క్లో పెట్టుబడులు చేసేందుకు ఈ రంగంపై భారీ సుంకాల్ని తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4జీ నుంచి 5జీ లోకి టెక్నాలజీ మారుతున్న సందర్భంగా నెటవర్క్స్ క్యారీ చేసే డాటా ఎన్నో రెట్లు ఉంటుందని, దీనిని వైర్లెస్గా క్యారీ చేయడం కుదరనందున ఫైబర్ అవసరమవుతుందని మూండ్రా తెలిపారు. రైట్ ఆఫ్ వే (ఆర్వోడబ్ల్యూ) నిబంధనల్ని సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు.