No Fastag Payment | ఇప్పటి వరకు జాతీయ రహదారులపై వెళుతున్నప్పుడు టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లిస్తున్నారు. ఇంతకుముందు క్యాష్ చెల్లించే వాహనదారుల సమయం ఆదా కోసం.. రెవెన్యూ పెంచుకోవడం కోసం కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఇకముందు ఫాస్టాగ్ రీడింగ్తో నిమిత్తం లేకుండా.. హైవే మీద టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించడానికి వాహనాలు బారులు తీరాల్సిన అవసరం లేదు. ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించినా పూర్తి టోల్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
ఇప్పుడంతా టెక్నాలజీ మయం కదా.. రాజస్థాన్లోని జాతీయ రహదారులన్నీ త్వరలో హైటెక్ మయం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ రవాణా మంత్రిత్వశాఖ నూతన కాన్సెప్ట్ అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో హైవే ( highway ) పై దూసుకెళ్తున్న వాహనం నంబర్ను రీడ్ చేసే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్ – ANPR ) సిస్టమ్ త్వరలో అమలు కాబోతున్నది.
భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రాజస్థాన్లో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేపై ఈ ఏఎన్పీఆర్ ( ANPR ) సిస్టమ్ అమల్లోకి తేనున్నారు. దీనివల్ల వాహన యజమాని జాతీయ రహదారిపై డ్రైవింగ్లో ఉన్నా డబ్బులు పే చేయవచ్చు. ఈ విధానం రాజస్థాన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నుంచి అమల్లోకి రానున్నది.
పంజాబ్లోని అమృత్సర్లో మొదలైన ఈ ఎక్స్ప్రెస్వే గుజరాత్లోని జామ్నగర్కు వెళుతుంది. ఈ దశలో రాజస్థాన్ను కూడా ఎక్స్ప్రెస్వే కలిపేస్తుంది. పంజాబ్, హర్యానా, అరేబియా సముద్రంలోని నౌకాశ్రయాలను కూడా కలుపుకుంటూ వెళుతుందీ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. రాజస్థాన్లోని 637 కి.మీ. పొడవు గల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను భారత్మాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్నారు.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగే ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తి పొడవు 1,224 కి.మీ. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాజస్థాన్లోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే కానున్నది. చాలా తక్కువ కర్వ్లు, మూలమలుపులు ఉండటం ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ. రాజస్థాన్లో 6 లేన్ల రోడ్ల నిర్మాణం 407 కి.మీ. మేర అంటే 64 శాతం పూర్తయింది. దీని అంచనా వ్యయం సుమారు రూ.14,707 కోట్లు అని, వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఇది పూర్తవుతుందని అంచనా.