Navratri Vehicle Sales | నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వెహికల్స్ రిటైల్ సేల్స్ అదరగొట్టాయి. సుమారు 5.4 లక్షల వాహనాలు అమ్ముడు పోయాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం తెలిపింది. గత నెల 26 నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు 5,39,227 వాహనాలు అమ్ముడయ్యాయని ఫాడా ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 3,42,459 వెహికల్స్ సేల్స్ జరిగాయి. 2019 నవరాత్రి ఉత్సవాల సేల్స్ 4,66,128 వెహికల్స్ కంటే ఎక్కువ అని ఫాడా తెలిపింది. మూడేండ్ల తర్వాత కస్టమర్లు షోరూమ్లకు వస్తున్నారని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో 3,69,020 బైక్స్, స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది 2,42,213 యూనిట్లతో పోలిస్తే 52.35 శాతం గ్రోత్ నమోదైంది. ప్రీ-కొవిడ్ ఏడాది 2019లో 3,55,851 టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే టూ వీలర్స్ సేల్స్ 3.7 శాతం పెరిగాయి. ప్రీ-కొవిడ్ నాటి పరిస్థితులతో పోలిస్తే టూ వీలర్స్ సేల్స్లో బలహీనత నమోదవుతున్నదని మనీశ్ రాజ్ సింఘానియా చెప్పారు. సింగిల్ డిజిట్ గ్రోత్ మాత్రమే నమోదవుతుందన్నారు.
గతేడాదితో పోలిస్తే కార్ల సేల్స్ 70.43 శాతం పెరిగాయి. 2020-21 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 64,850 కార్లు విక్రయిస్తే, ఈ ఏడాది 1,10,521 యూనిట్లకు చేరుకుందని ఫాడా తెలిపింది. వాణిజ్య వాహనాల సేల్స్ కూడా 48.25 శాతం వృద్ధి చెందాయి. 2021 నవరాత్రి ఉత్సవాల్లో 15,135 యూనిట్ల కమర్సియల్ వెహికల్స్ విక్రయిస్తే ఈ ఏడాది 22,437 యూనిట్లకు చేరాయి. త్రీ వీలర్స్ సేల్స్ 9,203 నుంచి 19,809 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల విక్రయాల్లో 57.66 శాతం గ్రోత్ రికార్డైంది. గతేడాది 11,062 ట్రాక్టర్లు విక్రయిస్తే, ఈ ఏడాది 17,440 అమ్ముడయ్యాయి.