న్యూఢిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరంలో నయా కార్లను విడుదల చేయడానికి వాహన ఉత్పత్తి సంస్థలు రెడీ అవుతున్నాయి. పాత సంవత్సరంలో అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు నయా సాల్పై గంపెడు ఆశ పెట్టుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఈ ఏడాది తొలి నెల జనవరిలో నాలుగు మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి మూడు సంస్థలు. వీటిలో స్పోర్ట్ యుటిలిటీ వాహనాలతోపాటు ఈవీ, లగ్జరీ కార్లను విడుదల చేయబోతున్నాయి మహీంద్రా, కియా, బెంజ్ సంస్థలు.
కియా సోనెట్
సరికొత్త సోనెట్ మాడల్ను ఈ నెలలోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా. గతంలో విడుదల చేసినదాని కంటే భిన్నంగా తీర్చిదిద్దిన ఈ మాడల్ను టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసింది. ఈ మాడల్కు ముందస్తు బుకింగ్లు ఆరంభించిన సంస్థ..ధర, ఇతర వివరాలను ఈ నెలలోనే ప్రకటించబోతున్నది.
నూతన మెర్సిడెజ్-బెంజ్ జీఎల్ఎస్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఈ నెల 8న దేశీయ మార్కెట్లోకి నూతన జీఎల్ఎస్ మాడల్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఏప్రిల్ 2023లోనే అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మాడల్ను ఎనిమిది నెలల తర్వాత భారత్లో ప్రవేశపెడుతున్నది. ఈ కారు ధర కోటి రూపాయల స్థాయిలో ఉంటుందని అంచనా. 3.0 లీటర్ల పెట్రోల్ లేదా 3 లీటర్ల డీజిల్ ఇంజిన్తో ఈ మాడల్ను తీర్చిదిద్దింది.
మహీంద్రా ఎక్స్యూవీ 400
మహీంద్రా అండ్ మహీంద్రా నయా ఎలక్ట్రిక్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ మాడల్ లోపలి భాగాన్ని నూతనంగా తీర్చిదిద్దింది. టాటా మోటర్స్కు చెందిన నెక్సాన్ ఈవీకి పోటీగా ఈ మాడల్ను ప్రవేశపెడుతున్నది.