Hyderabad | మాదాపూర్, మార్చ్ 9: హైదరాబాద్ నగరం పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నదని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వీ రాజశేఖర్ రెడ్డి అన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2024కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం అన్నివైపుల పెట్టుబడులకు అనువుగా ఉన్నదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. 2050 నాటికి మెగా మాస్టర్ ప్లాన్, ప్రతిపాదిత మూసి కారిడార్ వంటి కార్యక్రమాలతో పాటు మెట్రో రైల్ విస్తరణ, నగర ఉత్తర భాగాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో మహ నగరంగా మారనుందన్నారు.