Used Cars Market | కోవిడ్-19 పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. అయితే చిప్ల కొరత వల్ల కొత్త కార్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తున్నది. దీంతో కొత్తగా కారు కొనాలని భావించే వారంతా సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గుతున్నారు. ఫలితంగా యూజ్డ్ కార్ల సేల్స్ టాప్గేర్లో సాగుతున్నాయి. ఇప్పుడంతా స్టార్టప్ కంపెనీల హవా కదా.. యూజ్డ్ కార్లు.. అదే సెకండ్ హ్యాండ్ కార్ల క్రయ విక్రయాల కోసం ఏర్పాటైన మూడు స్టార్టప్ సంస్థలకు ఈ ఏడాది మంచి శుభారంభాన్నిచ్చింది. ఆ స్టార్టప్ సంస్థలు 100 కోట్ల డాలర్ల పై చిలుకు టర్నోవర్ గల యూనికార్న్స్ క్లబ్లో చేరిపోయాయి. సెకండ్ హ్యాండ్ కార్ల క్రయ విక్రయాల బిజినెస్లో భారీ గ్రోత్ ఉంటుందన్న అంచనాల మధ్య ఇన్వెస్టర్లు నిధులు కుమ్మరిస్తున్నారు. వచ్చే మూడేండ్లలో రెండురెట్లు.. పదేండ్లలో 8 రెట్లు బిజినెస్ పెరుగుతుందని భావిస్తున్నారు.
స్పిన్నీ అనే స్టార్టప్ సంస్థ ఈ నెల ప్రారంభం వరకు 283 మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకుంది. గత ఆరు నెలల్లోనే దాని విలువ 180 కోట్ల డాలర్లకు చేరుకుంది. అలాగే కార్స్24 మార్కెట్ విలువ గత మూడు నెలల్లోనే 60 శాతం పెరిగి 330 కోట్ల డాలర్లను తాకింది. గత అక్టోబర్లో 25 కోట్ల డాలర్ల నిధులు సేకరించింది మరో సంస్థ కార్దేఖో. డ్రూమ్ అనే మరో యూనికార్న్ కూడా 200 మిలియన్ల డాలర్లకు ప్రతిపాదించిన ఐపీవో ఆఫర్ ముగిసింది.
ఓఎల్ఎక్స్ ఆటో-క్రిసిల్ స్టడీ ప్రకారం గత నాలుగేండ్లలో యూజ్డ్ కార్ల సేల్స్ సుమారు రెట్టింపై 70 లక్షలకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40 లక్షల్లోపే ఉన్న సెకండ్ హ్యండ్ కార్ల సేల్స్.. వచ్చే మార్చి నెలాఖరు నాటికి 44 లక్షలకుచేరతాయని అంచనా వేస్తున్నారు. 2029-30 ఆర్థిక సంవత్సరం కల్లా యూజ్డ్ కార్ల మార్కెట్ కోటికి చేరుతుందని ఓఎల్ఎక్స్ ఆటోస్ సీఈవో అమిత్ కుమార్ చెప్పారు.
ఇదిలా ఉంటే, డిమాండ్కు అనుగుణంగా యూనికార్న్ సంస్థలు సిబ్బందిని నియమించుకున్నాయి. మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నాయి. ప్రస్తుతం 13 సిటీల్లో సేవలందిస్తున్నామని స్పిన్నీ ఫౌండర్ సీఈవో నీరజ్ సింగ్ చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో 25 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెంచుతున్నామన్నారు.
కార్ 24 ఫౌండర్ కం సీఈవో విక్రం చోప్రా మాట్లాడుతూ తాము ఆస్ట్రేలియా, థాయిలాండ్, మధ్యప్రాచ్యంలో సేవలందిస్తున్నామని చెప్పారు. మున్ముందు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించడానికి నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఆర్గనైజ్డ్ యూజ్డ్ మార్కెట్లో 50% వాటా గల మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్. ఆ సంస్థ సీఈవో అశుతోష్ పాండే మాట్లాడుతూ రిటైల్ బిజినెస్కు సారధ్యం వహించేందుకు నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
గత పదేండ్లలో మొబైల్ ఫోన్ల కొనుగోలు కోసం పరుగులు తీసిన ప్రజలు.. ఇక యూజ్డ్ కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారని అశుతోష్ పాండే తెలిపారు. ఫొమో వంటి యూజ్డ్ కార్ల సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి.
యూజ్డ్ కార్ల మార్కెట్ బుల్లా పరుగులు తీస్తుందన్నారు. గ్లోబల్ మార్కెట్లో కొత్త కార్లు.. యూజ్డ్ కార్ల నిష్పత్తి 3:1 అయితే, దేశీయ నిష్పత్తి 1.5:1గా శరవేగంగా పెరుగుతున్నదని కార్స్24 సీఈవో విక్రం చోప్రా తెలిపారు.