– నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ.హఫీజ్ ఖాన్
రామగిరి, జూలై 02 : నల్లగొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు జిల్లా గ్రంధాలయ సంస్థకు సెస్ చెల్లించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థలో చైర్మన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించి, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రంథాలయ సంస్థ అభివృద్ధి, సిబ్బంది సమస్యలు, గ్రంథాలయాల సంస్థ నిర్వహణ తదితర అంశాలపై సభ్యులతో విస్తృతంగా చర్చించారు. గత సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏడుగురు సిబ్బంది పదవీ విరమణ పొందడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాన్ని పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల దృష్టికి తీసుకెళ్లి, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని, కలెక్టర్& మెజిస్ట్రేట్ గెజిట్ ప్రకారం సిబ్బంది 6 గ్రంథ పాలకులు, 2 లైబ్రరీ హెల్పర్ల నియామకానికి పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం తెలిపారు
నల్లగొండ జిల్లాలో గ్రంథాలయాల శాఖ పని వేళలు, వేతనాల పెంపు అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానం చేశారు. వివిధ శాఖ గ్రంథాలయాల్లో పదవీ విరమణ పొందిన సిబ్బంది కాలంలో పోయిన పుస్తకాలకు సంబంధించిన అంశంపై 2025–26, 2026–27 సంవత్సరాలకు సంబంధించి రద్దు ప్రతిపాదనలు పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులకు పంపేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం 5 ఎజెండా అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, విద్యాశాఖ సీఎంఓ కత్తుల రవీందర్, వయోజన విద్యాధికారి దుర్గాప్రసాదరావు, ఏపీఆర్ఓ బి.బీమేశ్, డీపీఓ అధికారి వెంకటేశ్వర్లు, లైబ్రరీ ఇన్చార్జి రాజేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.