Apple-China | చైనా ప్రభుత్వ నిషేధంతో ఆపిల్ సహా గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు విలవిల్లాడాయి. ఐ-ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ షేర్లు 6.4 శాతం నష్టపోగా, ఆపిల్ సప్లయర్స్.. క్వాల్కామ్ ఇంక్, స్కైవర్క్స్ సొల్యూషన్స్ స్టాక్స్ ఏడు శాతానికి పైగా పతనం అయ్యాయి. మైక్రోసాఫ్ట్, నివిదిత కార్ప్ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. ఆపిల్ స్టాక్స్ పతనంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,60,621 కోట్ల మేరకు నష్టపోయింది.
మరో ఐదారు రోజుల్లో ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించనుండగా సంస్థ షేర్లు పతనం కావడం స్మార్ట్ ఫోన్ల తయారీ పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయని చెబుతున్నారు. అమెరికా-చైనా మధ్య నెలకొన్న భౌగోళిక, ఆర్థిక ఉద్రిక్తతలతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆపిల్ ఐఫోన్లకు చైనా అతిపెద్ద మార్కెట్. ఐ-ఫోన్ల విక్రయాల్లో చైనాలోనే ఐదు కోట్లు అమ్ముడవుతున్నాయి. తాజాగా చైనా నిషేధం విధించడంతో 50 లక్షల నుంచి కోటి వరకూ సేల్స్ తగ్గుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది.
ఆపిల్ ఐ-ఫోన్లకు చైనా టెక్ దిగ్గజం హువావే నుంచి గట్టి పోటీ నెలకొంది. 2019లో హువావే ఫోన్ల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించినప్పటి నుంచి ఆ సంస్థ స్మార్ట్ ఫోన్ల బిజినెస్ క్రమంగా పడిపోయింది.
గత శుక్రవారం హువావే రెండు స్మార్ట్ ఫోన్లు మ్యాట్ ఎక్స్5, మ్యాట్ 60 ప్రో+ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. అమెరికా ఆంక్షలతో తోసి రాజని హువావే స్మార్ట్ ఫోన్లకు గ్లోబల్ మార్కెట్లలో ఆదరణ పెరగడం గమనార్హం.