న్యూయార్క్ : టెక్ దిగ్గజాల మాస్ లేఆఫ్స్తో ఈ వింటర్ టెకీలకు మరింత వణుకుపుట్టిస్తోంది. ఆర్ధిక మందగమనం పేరిట పలు టెక్నాలజీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ట్విట్టర్, ఫేస్బుక్, అమెజాన్ సహా పలు కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు దిగాయి. ఇంతటి సంక్లిష్ట సమయంలోనూ కొలువులు కోల్పోయిన టెకీలకు ఓ సంస్ధ ఆసరాగా నిలిచింది.
ఈ కంపెనీల్లో ఉద్యోగం కోల్పోయిన టెకీలు వినూత్న స్టార్టప్ ఐడియాతో ముందుకొస్తే వారికి లక్ష డాలర్ల (రూ. 81లక్షలు) నిధులు సమకూర్చేందుకు అమెరికాకు చెందిన డేవన్ వెంచర్ ముందుకొచ్చింది. ఇటీవలి లేఆఫ్స్లో వేటు పడిన టీమ్స్ నేతృత్వంలోని 20 న్యూ స్టార్టప్లకు ఈ సాయం అందిస్తామని డే వన్ వెంచర్ తెలిపింది. తొలివిడత ప్రీసీడ్ రౌండ్లో రూ 81 లక్షలను స్టార్టప్స్కు అందించాలని డేవన్ వెంచర్స్ నిర్ణయించిందని ఆపై రూ. 40 కోట్ల వరకూ ఆయా స్టార్టప్ల ఫౌండర్లకు మలి దశ కింద అందించాలని డేవన్ వెంచర్స్ యోచిస్తోందని టెక్క్రంచ్ రిపోర్ట్ వెల్లడించింది.
ట్విట్టర్, అమెజాన్, ఫేస్బుక్ వంటి టెక్ కంపెనీల లేఆఫ్స్లో కొలువులు కోల్పోయిన ఔత్సాహిక టెకీలకు ఈ ఫండింగ్ సపోర్ట్ అందచేయాలని డే వన్ వెంచర్ నిర్ణయించింది. టెక్ దిగ్గజాల లేఆఫ్స్ నిర్ణయంతో ఎఫెక్ట్ అయిన టెకీలకు అవకాశాలు కల్పించేందుకు డే వన్ వెంచర్తో పాటు పలు సంస్ధలు ముందుకొస్తున్నాయి. లింక్డిన్ వంటి సోషల్ మీడియా వేదికలపై వీరి కోసం జాబ్ ఆఫర్లను కోరుతూ పలు పోస్ట్లు దర్శనమిస్తున్నాయి.
ఇక ఆర్ధిక మందగమనం నేపధ్యంలో ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ సగం మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించగా, మెటాలో ఏకంగా 13,000 మంది ఉద్యోగులపై వేటు వేశారు. ఇక తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 10,000 మందిని విధుల నుంచి తప్పించనున్నట్టు ప్రకటించింది.